2019 లో ఏపీ లో వై ఎస్ జగన్ వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం,అలానే ఇటీవల ఢిల్లీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.99శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న ప్రశాంత్ తో కలిసి పని చేయడానికి అన్ని పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ,తమిళనాడులో డీఎంకే తో కలిసి పనిచేయడానికి అవగాహన కుదుర్చుకున్నారు.అయితే ఇప్పుడు తాజాగా జేడీఎస్ కూడా పీకే తో పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తుంది.
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్తో జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మంగళవారం భేటీ అయ్యారు.పార్టీ భవిష్యత్తు కోసం ఏం చేయాలనే అంశాన్ని చర్చించారు.తొలి విడత చర్చలు జరిగాయని, మిగతా అంశాలను తర్వాత వెల్లడిస్తానని కుమారస్వామి తెలిపారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లను గెలుపొంది కాంగ్రెస్ మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో 28 సీట్లకు గానూ ఆ పార్టీ కేవలం ఒక్క చోట మాత్రమే గెలుపొందడం, అలానే బలపరీక్ష లో కుమారస్వామి ఓటమి పాలవ్వడం తో కేవలం నెలల్లోనే ఆయన సీఎం పీఠం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.