వైసిపి 2019 లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖ జిల్లాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు మధ్య సమన్వయం కనిపించకపోగా, ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం వంటి వ్యవహారాలతో తరుచుగా విశాఖ వార్తల్లోకి ఎక్కుతోంది. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్న విశాఖ జిల్లాలో వైసిపి ప్రభావం బాగానే ఉన్నా, పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన గ్రూపు తగాదాలు వంటివి వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి.
విశాఖలో వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే విధంగా పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన తగాదాలు కారణమవుతున్నాయని గుర్తించిన పార్టీ హైకమాండ్ తాజాగా వైసీపీ రాజకీయ వ్యూహ కర్తగా గతంలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీంను రంగంలోకి దించారు.
ఈ టీం లోని కీలక సభ్యుడి ఆధ్వర్యంలో విశాఖలో సర్వే మొదలుపెట్టారు.
ఈ సర్వేలో అనేక అంశాలపై జనాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న ట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంది వంటి విషయాల తో పాటు, వైసీపీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారట.
ముఖ్యంగా మొదటి నుంచి వైసీపీలో ఉంటూ, పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం ఈ సర్వేలో వెల్లడైనట్లు సమాచారం.తాము ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్నా, తమకు పదవుల విషయంలో అన్యాయం జరిగిందని ఏ విషయంలోనూ తమకు సరైన న్యాయం జరగడం లేదని, చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేక పోతున్నామని, తమకంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ పెద్దపీట వేస్తున్నారని ఇలా ఎన్నో అంశాలు ఈ సర్వేలో తేలినట్లు సమాచారం.
ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే వారి పనితీరు ఏ విధంగా ఉంది ఎవరెవరు ప్రజల్లోకి వెళ్తున్నారు ? ప్రజల నుంచి సదరు ఎమ్మెల్యే పనితీరు పై ఏ విధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇలా అనేక అంశాలు సర్వేలో సేకరిస్తున్నట్లు సమాచారం.ఈ సర్వే వివరాలు ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి చేరుతుండడంతో నియోజకవర్గస్థాయి నాయకులు , ఎమ్మెల్యేలు ఈ సర్వే విషయంలో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.ఈ సర్వే ఆధారంగానే విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పార్టీని ప్రక్షాళన చేసేందుకు జగన్ సిద్ధం అవుతారనే సమాచారంతో ఈ ప్రాంత నేతలు ఈ సర్వే పై టెన్షన్ పడుతున్నారట.