బీజేపీ తో జగన్ ఎప్పుడూ సానుకూల వైఖరితో ఉన్నట్టుగా కనిపిస్తారు.అన్ని క్లిష్ట సమయాల్లోనూ ఆపన్నహస్తం అందిస్తూ, బిజెపి ప్రవేశపెట్టే బిల్లులకు తమ ఎంపీల ద్వారా మద్దతు ఇస్తూ, బీజేపీకి తాము ఎంత దగ్గరగా ఉంటున్నాము అనే విషయాన్ని జగన్ గుర్తు చేస్తూ ఉంటారు.
ఎన్డీఏ లోని మిత్ర పక్షాలు సైతం ఒక సందర్భంలో బీజేపీపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చినా, జగన్ మాత్రం అన్ని సందర్భాల్లోనూ బీజేపీ కి అండగానే నిలబడుతూ వస్తున్నారు.భవిష్యత్తులోనూ బీజేపీ విషయంలో జగన్ ఇదే వైఖరితో ఉంటారనే సంకేతాలు వస్తున్న సమయంలోనే ఇప్పుడు వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కారణంగా జగన్ వైఖరిలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఏకం చేసే పనిలో ఉన్నారు.బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీల కూటమి ని బలోపేతం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలతోనూ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.వీటిల్లో చాలా వరకు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలతోనే అధికారంలోకి వచ్చిన పార్టీలు ఉండడంతో వారంతా పీకే చూపించిన మార్గంలో నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పీకే తో భేటీ కాబోతున్నారు.ఆయన ఇప్పటికే బీజేపీ వ్యతిరేక కూటమిలో వచ్చేందుకు ఆసక్తి గా ఉండడంతో ఇక అందరి దృష్టి జగన్ పైనే పడింది.
ప్రశాంత్ కిషోర్ జగన్ ను బీజేపీ వ్యతిరేక కూటమి లోకి రావాల్సిందిగా పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది.ఈ కూటమి లోకి రావడం వల్ల జగన్ కు బీజేపీ నుంచి తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా, భవిష్యత్తులో మంచి జరుగుతుందని ప్రశాంత్ కిషోర్ ను ఒప్పించే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే బీజేపీ తో సన్నిహితంగా జగన్ మెలగడానికి కారణం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నిధులతో పాటు కేసుల వ్యవహారంలోనూ బీజేపీ సహకారం అవసరం.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, ఆ పార్టీతో సఖ్యత గా ఉండడం కంటే బీజేపీ వ్యతిరేక కూటమి లో చేరడం వల్ల రాజకీయంగా కలిసొస్తుందని జగన్ ను పీకే ఒప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏది ఏమైనా ఈ విషయంలో జగన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశమే కనిపిస్తోంది.