వైసీపీ రాజకీయ వ్యూహకర్త గా పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను గెలిపించడంలో సక్సెస్ అయ్యారు.దీంతో ఆయన సత్తా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
ఆయనను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకునేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతూనే ఉన్నాయి.అయితే తాను ఇకపై వ్యూహకర్తగా పని చేయబోనని ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు.
కాకపోతే ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీమ్ మాత్రం పని చేస్తుందని ఆయన ప్రకటించారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
మొన్నటి వరకు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా ఇప్పుడు రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
దీంతో కాంగ్రెస్ ప్రధాన పోటీదారుడు ఆయనే అనే విషయం తెలంగాణలో తెరపైకి వచ్చింది.
అయితే రేవంత్ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తే ఆ ఎఫెక్ట్ పడేది షర్మిల పార్టీపైనే.ముఖ్యంగా షర్మిలకు దగ్గరవుతారు అనుకున్న రెడ్డి సామాజిక వర్గం చూపు రేవంత్ పై పడడంతో షర్మిల పార్టీలో కంగారు మొదలైంది.
రేపు పార్టీ పేరును ప్రకటించబోతున్న షర్మిల అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు.ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ లోటస్ పాండ్ లో కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
ఇప్పటికే షర్మిల పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ టీమ్ లోని ప్రియ పని చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లోటస్ పాండ్ కి రావడం వెనుక రేవంత్ రెడ్డి దూకుడే కారణంగా తెలుస్తోంది.ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు, షర్మిల పార్టీ ప్రకటన రోజున అనుసరించవలసిన రాజకీయ వ్యూహాలపై చర్చించేందుకు ప్రశాంత్ కిషోర్ లోటస్ పాండ్ కి వచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.వైసిపికి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేసిన సమయంలో లోటస్ పాండ్ లోనే పీకే టీం కు కార్యాలయం ఏర్పాటు చేశారు.
ఇప్పటికీ అది కొనసాగుతోంది.దీంతో ఆ ఆఫీస్ నే ఇకపైనా కొనసాగిస్తూ రేవంత్ దూకుడుకు బ్రేక్ వేసే విధంగా ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిశోర్ తన శిష్య బృందానికి సూచనలు చేయబోతున్నట్లు సమాచారం.
ఏది ఏమైనా అన్ని పార్టీలు మాదిరిగానే షర్మిల పార్టీకి రేవంత్ భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.