జగన్ ఏ విషయంలోనూ రాజీ పడే వ్యక్తి కాదు.ఎందులో అయినా తనదే పై చేయిగా ఉండాలనే మనస్తత్వంతో ఆయన ఉంటారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే వరకు, ఇప్పుడు పరిపాలన అన్నీ అదే రకంగా జరుగుతున్నాయి.ప్రస్తుతం తెలుగుదేశం,బీజేపీ, జనసేన వీటన్నిటితో జగన్ కు ఏ ఇబ్బంది లేదు.
పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏమిటనేది తేలిపోయింది.ఎంపీటీసీ , జడ్పిటిసి ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుకునేందుకు సిద్ధంగా ఉంది.
కాకపోతే పార్టీలో కొంతమంది నాయకులు అసంతృప్తితో ఉండడంతో పాటు, మరికొంతమంది ఎమ్మెల్యేలు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం పై జగన్ సీరియస్ గానే దృష్టిపెట్టారు.
వారి పనితీరు మార్చుకోవాలని పార్టీ పెద్దల ద్వారా పదేపదే జగన్ చెప్పిస్తున్నారు.
అయినా వారి శైలిలో మార్పు రాకపోగా, ప్రభుత్వంపై వారి ప్రభావం పడడం , తద్వారా ప్రజల్లో చులకన అవడం వంటి వ్యవహారాలు రాబోయే ఎన్నికల సమయంలో ఇబ్బంది పెడతాయేమో అన్న ఆందోళనలో ఉన్న జగన్ అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ వ్యూహాలతో పాటు, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను దగ్గరుండి చూసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట.అది కూడా ఇప్పటి నుంచే ఆయన సేవలను వినియోగించుకుని, పార్టీ పైన, ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను తగ్గించే విధంగా సరికొత్త రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళ్లాలని, అలాగే ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై ప్రశాంత్ కిషోర్ టీమ్ దృష్టి పెట్టడంతో పాటు, 2024 ఎన్నికలలో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ను సైతం ప్రశాంత్ కిషోర్ కే అప్పగించాలని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.
ఇప్పటికే ఇంటలిజెన్స్ నివేదికలు సైతం కొంతమంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రావడం, చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలి అనే విషయం పై జగన్ కు క్లారిటీ రావడం, అలాగే జనసేన టిడిపి మళ్లీ పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉండడం వంటి వ్యవహారాలతో ముందుగా ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకుని మళ్లీ వైసీపీ విజయానికి డోకా లేకుండా చేసుకునే ప్లాన్ లో జగన్ ఉన్నట్టు సమాచారం.