ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ గాలి వీస్తుంటే… ఆ పార్టీలో మాత్రం ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది.ఒకవైపు పార్టీని పటిష్టం చేస్తూ… వైసీపీ ‘గాలి’ తిరిగేలా ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రంగా కష్టపడుతున్నారు.
జగన్ అనుకున్నట్టుగానే కొంతమేర ఏపీలో అనుకూల పవనాలు వీస్తున్నాయి.అధికార పార్టీ టిడిపి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా అన్ని రకాల ఇబ్బందులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తమ పార్టీలో ఉన్న ఇబ్బందులను తొలిగించుకునే పనిలో ఆ పార్టీ ఉంది.
అయితే ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతులు పెద్ద ఎత్తున చోటుచేసుకోవడంతో ముందుగా ఉన్న ఇల్లు చక్కబెట్టుకోవాలని , ఆ తర్వాత ఎన్నికల గురించి ఆలోచించాలి అని వైసిపి భావిస్తోంది.
ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు.
కానీ ఆయన ఎప్పటికప్పుడు స్థానికంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి పార్టీల నాయకులతో చర్చిస్తూనే ఉన్నారు.ప్రస్తుతం అసమ్మతి నాయకులను గుర్తించి వారిని పిలిచి బుజ్జగించాలని చూస్తోంది.
ఈ పని ప్రస్తుతానికి ఆ పార్టీ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ భుజాన వేసుకున్నాడు.ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ టిక్కెట్ కోసం ఇద్దరు ముగ్గురు నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
ఎవరికి వారు ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టెయ్యడంతో… ఎవరికి టికెట్ కేటాయిస్తే ఎవరికి కోపం వస్తుందో వారు పార్టీ అభ్యర్థి కి వ్యతిరేకంగా పని చేస్తారని భావించి ముందుగానే వారిని హైదరాబాద్ పిలిపించి మాట్లాడుతున్నారు.
ప్రతిరోజు వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ఆశావహులను హైదరాబాద్ కు పిలిపించి మాట్లాడే పని పీకే, ఆయన టీమ్ సమర్థవంతంగా నిర్వహిస్తోంది.అలా పిలిచిన నేతలకు వారి నియోజకవర్గంలో ఉన్న వాస్తవ పరిస్థితులు గెలుపు, ఓటములు, తాము నిర్వహించిన సర్వేల ఫలితాలను చూపించి వారిని మీరే ఎదో ఒకటి తేల్చుకోవాలంటూ వారికే ఆప్షన్ ఇచ్చేస్తున్నారు.అయితే పీకేను కలిసిన నాయకులు కూడా తమ వాయిస్ బలంగానే వినిపిస్తున్నారట.
ఈ ఐదేళ్ల కాలంలో పార్టీ కోసం అప్పులు చేసి మరీ కార్యక్రమాలు నిర్వహించామని చివరి నిమిషంలో సర్వేలు పేరు చెప్పి తమను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ పీకేను ఎదురు ప్రశ్నిస్తున్నారు.ఏదైనా ఉంటే తాము నేరుగా జగన్ తో మాట్లాడుకుంటాం అంటూ కొంతమంది ముక్కుసూటిగా చెప్పేస్తున్నారట.