పైకి చెప్పకపోయినా ఏపీ అధికార పార్టీ వైసిపి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది.జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే భారీ ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశారు.
మరెన్నో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ప్రతి దశలోనూ జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా ప్రజావ్యతిరేకత క్రమక్రమంగా పెరిగిపోతూ వస్తోంది.దీనికితోడు కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడం తో ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు, జీతాలు చెల్లించేందుకు ప్రతినెల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తుండటం, మరింత ఇబ్బందికరంగా మారింది.
2024 ఎన్నికల నాటికి గెలుపు కూడా ఇబ్బంది అవుతుందనే అభిప్రాయం జగన్ లో మొదలైనట్లుగా ఇప్పుడు కొన్ని సంకేతాలు వెలువడుతున్నాయి.ఈ క్రమంలోనే తమ పార్టీ రాజకీయ వ్యూహ కర్త, 2019 ఎన్నికల్లో తమను అధికారంలోకి తీసుకొచ్చేందుకు గట్టిగా కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ ను మళ్లీ యాక్టివ్ చేసేందుకు, వైసిపి 2024లో గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు.ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో జగన్ వివిధ అంశాలపై మంత్రులకు లీకులు ఇచ్చారు.
అయితే ఇప్పటి నుంచే ప్రశాంత్ కిషోర్ సేవలను వైసిపి తీసుకోవాలని అనుకోవడం వెనుక ముందస్తు ఎన్నికలకు జగన్ ప్లాన్ చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐ ఫ్యాక్ టీం ఏపీలో వైసీపీ కోసం పని చేయబోతోంది అనే విషయాన్ని స్వయంగా జగన్ మంత్రులకు చెప్పడంతో, అసలు పీకే అవసరం మళ్లీ జగన్ కు ఎందుకు వచ్చింది అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అప్పుడే జగన్ ఎన్నికల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని, ప్రతిపక్షాలు రోజురోజుకీ బలం పుంజుకోవడం వంటి కారణాలతోనే జగన్ ఇప్పటి నుంచే పీకే సలహాలతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.