రాజకీయ నాయకులు రకరకాల నాటకాలు ఆడతారు.పార్టీలు మారాలనుకున్న నాయకులు ముదుగా రకరకాల వార్తలు ప్రచారంలోకి తెస్తారు.
ఆ వార్తలు జనంలో, రాజకీయ పార్టీల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుంటారు.వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి అడుగులు వేస్తుంటారు.
పార్టీ మారాలనుకున్న నాయకులు ఆ విషయం బయటకు రాగానే ‘అబ్బే…అదేం లేదు.ఇది ఉత్తుత్తి ప్ర చారమే’ అని ఖండిస్తారు.
బొందిలో ప్రాణం ఉండగా పార్టీ మారేది లేదని, పార్టీ విడిచిపెట్టేది లేదని నమ్మబలుకుతారు.కాని కొంతకాలం తరువాత చేయాల్సిన పని చేస్తారు.
బుధవారం వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అద్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది.ఆయన రాజీనామా చేయబోతున్నట్లు, చేసేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
చివరకు ఏమైందో ఏమోగాని సాయంత్రం ప్రసన్నకుమార్ రెడ్డి ‘నేను వైకాపాను విడిచిపెట్టి పోవడంలేదు’ అని ప్రకటించారు.తాను జగన్కే మద్దతు ఇస్తానని, చివరివరకు వైకాపాలోనే ఉంటానని చెప్పారు.
తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అంతా ‘ఉత్తిదే’ అని తేల్చిపారేశారు.ప్రసన్నకుమార్ రెడ్డిని జగన్ బుజ్జగించాడో, మరికొంతకాలం వేచి చూద్దామని ఈయనే అనుకున్నాడో తెలియదు.
చేరాలనుకున్న పార్టీతో అనుకున్న ఒప్పందం కుదిరివుండకపోవచ్చు.కారణమేదైనా ప్రస్తుతం తాను వైకాపాను విడిచిపెట్టడంలేదని ప్రసన్నకుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఇది మనసులో నుంచి వచ్చిందో, పెదవుల పైనుంచి వచ్చిందో తెలియదు.