ఇండియాలో విలక్షణ నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్.సుమారు అన్ని ఇండియన్ భాషలలో ప్రతినాయకుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి సత్తా చాటిన ప్రకాష్ రాజ్ కి సామాజిక దృక్పథం కూడా ఎక్కువ.
సామాజిక అంశాల మీద ఎప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు.అలాగే రాజకీయ అంశాల మీద కూడా సూటిగా బాణాలు వేస్తూ ఉంటాడు.
ఎక్కువగా బీజేపీ, మోడీ విధానాలని వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ అవకాశం దొరికిన ప్రతిసారి ఆ మోడీపై విమర్శలు చేస్తూ ఉంటాడు.ఈ కారణంగా చాలా మంది అతనిని హిందుత్వ వ్యతిరేకి అనే ముద్ర వేసి టార్గెట్ చేస్తూ ఉంటారు.
ఆ మధ్య కాలంలో ఓ హిందుత్వ సంస్థ ప్రకాష్ రాజ్ ని హత్యాయత్నంకి కూడా ప్లాన్ చేసింది.అలాగే ఎప్పటికప్పుడు చంపేస్తాం అంటూ అతనికి బెదిరింపులు వస్తూనే ఉంటాయి.ఇలాంటి వాటిపై తాజాగా ప్రకాష్ రాజ్ ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందించాడు.గతంలో తనను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చేవని, అయితే తాను పిరికివాడ్ని కాదని స్పష్టం చేశారు.
ఒకర్ని చంపేద్దామని భావించేవాళ్లు తన దృష్టిలో చచ్చిపోయిన వాళ్ల కింద లెక్క అని అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం తనకు బెదిరింపులు ఏమీ రాకపోయినా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తుంటారని, రోగులను ఓ డాక్టర్ ఎలా చూస్తాడో అలాంటి విమర్శకులను తానూ అలాగే చూస్తానని ప్రకాశ్ రాజ్ వివరించారు.
ఇటీవల తన కుమారుడి ఫొటో పోస్టు చేస్తే నీ మనవడా అని, ఎన్నో భార్య కొడుకు అని వెటకారం చేశారని వెల్లడించారు.ఇలాంటి విమర్శలు ప్రతి రోజు వినడం తనకి అలవాటైపోయింది అని చెప్పారు.
తనపై విమర్శలు చేసేవారిని, బెదిరించే వారిని రోగులు క్రిందనే చూస్తానని వ్యాఖ్యలు చేశారు.