యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాను పీరియాడికల్ ఎంటర్టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను క్యూలో పెడుతున్నాడు.
ఇప్పటికే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్ స్టార్.ఇక ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ చిత్రంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు, ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
కాగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే ప్రభాస్ మరో భారీ ప్రాజెక్టును ఓకే చేసేందుకు రెడీ అయ్యాడట.
ప్రముఖ బాలీవుడ్ నిర్మణ సంస్థ టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఓ భారీ పాన్ ఇండియా మూవీని ప్రభాస్ హీరోగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాను నేరుగా హిందీలో తెరకెక్కించి, ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నాడట.ఇక ఈ సినిమాను తెరకెక్కించేందుకు సరైన దర్శకుడితో పాటు అదిరిపోయే టెక్నీషియన్లను వెతికే పనిలో సదరు నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది.
మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సినిమా పూర్తి మైథలాజికల్ కథగా రానుందట.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు భూషణ్ కుమార్ రెడీ అవుతున్నాడు.