పోస్ట్ స్టడీ వర్క్ పాలసీ ద్వారా మరింత మంది భారతీయులు తమ దేశంలో చదువుకునేందుకు వీలు కలుగుతుందన్నారు ఆస్ట్రేలియా విద్యా శాఖ మంత్రి డాన్ టెహన్ తెలిపారు.ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్న టెహన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్ధులకు ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతితో పాటు పరిశోధనా సౌకర్యాలను కల్పించాయన్నారు.ఇదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా భారతీయ విద్యార్ధులు 5.5 బిలియన్ డాలర్లను ఆస్ట్రేలియా ఆర్ధిక వ్యవస్ధకు అందించారని టెహన్ తెలిపారు.
కొన్ని దేశాల విద్యార్ధులకు ప్రస్తుతమున్న పోస్ట్ స్టడీ వర్క్ పాలసీని నాలుగేళ్లకు పెంచామని ఆయన పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో శాశ్వత నివాస విధానం ఇతర దేశాల కంటే ఎంతో మెరుగైనదని.ఇది పోస్ట్ స్టడీ పని హక్కులతో సమానం కాదన్నారు.అలాగే మెల్బోర్న్, బ్రిస్బేన్, సిడ్నీ నగరాలకు వెలుపలి ప్రాంతాల్లో చదువుకునే విద్యార్ధులకు మరిన్ని సౌకర్యాలతో పాటు స్కాలర్షిప్ సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టామని టెహన్ వెల్లడించారు.భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, క్రీడా మరియు చారిత్రక సంబంధాలు ఉన్నాయన్నారు.
ఉన్నత విద్య ద్వారా ఈ సంబంధాన్ని బలోపేతం చేయడం ద్వారా రెండు దేశాలకు ప్రయోజనం కలుగుతుందని టెహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2014 నుంచి ఆస్ట్రేలియాలో చదువుతున్న భారతీయ విద్యార్ధుల సంఖ్య 71 శాతం పెరిగింది.గత ఏడాది 2018-19లో 1,07,673 మంది విద్యార్ధులు చదువుకోవడానికి చేరినట్లు ఆస్ట్రేలియాలోని కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గురువారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.కాగా అంతకుముందు ఏడాదితో పోలీస్తే 2019లో ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధుల నమోదులో 39శాతం పెరుగుదల నమోదైందని ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమీషన్ అధికారి ఒకరు వెల్లడించారు.
విదేశీ విద్యార్ధులలో చైనీయుల తర్వాత భారతీయులు రెండో స్థానంలో నిలిచారు.