అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు మహిళలను ఉద్దేశించి వైసీపీ నాయకుడు ఎస్విబిసి చైర్మన్ పృథ్వీరాజ్ పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యానించడాన్ని సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.వైసీపీ తరఫున ఏదైనా విషయం మాట్లాడాలంటే సామాజిక స్పృహ ఉన్న వారిని కూర్చోబెట్టాలి తప్ప ఎవరిని పడితే వారిని కూర్చోబెట్టి జగన్ పరువు పోకూడదని ఆయన సూచించారు.
అమరావతి ప్రాంత రైతులు మహిళలపై పృధ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు సరి కాదని వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి వారు అందరికీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించి మూడు పంటలు పండే భూములను త్యాగం చేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ పృథ్వి ఎలా మాట్లాడుతారు అంటూ పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు ప్యాంటు షర్టు వేసుకోకూడదా ? రైతు ఆడపడుచులు ఖరీదైన బట్టలు కట్టుకోకూడదా ? సెల్ ఫోన్ వాడకూడదా ? అంటూ పోసాని పృధ్విని ప్రశ్నించారు.
ఇటువంటి మాటలు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలని, నువ్వు అన్న మాటలకు సిగ్గుపడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు నీలాంటి వ్యక్తులు వల్లే జగన్ కు చెడ్డపేరు వస్తోందని, అందరూ జగన్ ను నీవల్లే విమర్శిస్తున్నారు అంటూ పోసాని ఫైర్ అయ్యారు.జగన్ ప్రభుత్వం పేరును నాశనం చేసేందుకు నీలాంటి వాళ్ళు పుట్టారు.
సిగ్గుపడాలి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.