పోర్చుగల్లో వైద్యం అందక భారతీయ గర్భిణీ మరణించిన వ్యవహారం కలకలం రేపింది.ఈ నేపథ్యంలో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు.
వివరాల్లోకి వెళితే… లిస్బన్లోని శాంటియా మారియా ఆసుపత్రిలోని నియోనాటాలజీ విభాగం కిక్కిరిసిపోవడంతో భారతీయ గర్భిణిని అక్కడి నుంచి అంబులెన్స్లో నగరంలోని ఆసుపత్రుల చుట్టూ తిప్పారు.ఈ క్రమంలో బాధితురాలు గుండెపోటుతో ప్రాణాలు వదిలారు.
దీంతో వైద్యులు ఎమర్జెన్సీ సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.ఈ ఘటనతో దేశంలోని వైద్య సదుపాయాలు, ఆసుపత్రుల స్థితిపై ప్రజలు తీవ్ర విమర్శలు చేశారు.
దీంతో పోర్చుగల్ ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందిస్తూ.భారతీయురాలి మృతిపై విచారణకు ఆదేశించింది.
ఇదిలావుండగానే మార్టా తన పదవికి రాజీనామా చేశారు.దేశంలో సరిపడినంత మంది వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర ప్రసూతి సేవలను నిలిపివేయాలన్న ఆమె నిర్ణయం కారణంగానే భారతీయురాలు మరణించిందని విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు ఆమె రాజీనామాను ప్రధానమంత్రి అంటోనియా కోస్టా ఆమోదించినట్లు పోర్చుగల్ నేషనల్ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ ఆర్టీపీ న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది.
ఇకపోతే.2018లో పోర్చుగల్ ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మార్టా అనతి కాలంలోనే తన పనితీరుతో మంచి పేరు తెచ్చుకున్నారు.ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి విరుచుకుపడిన సమయంలో సమర్ధవంతంగా వ్యవహరించారు.
దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయించడంలో మార్టా విజయం సాధించారు.
మరోవైపు. పోర్చుగల్లో గర్భిణీలు, శిశువులు మృతి చెందిన ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి.ఆసుపత్రుల కోసం తిరిగి తిరిగి గర్భవతులు నరకం అనుభవిస్తున్నారు.
దేశంలో ఆరోగ్య సిబ్బంది కోరత తీవ్రంగా వుంది.ముఖ్యంగా గైనకాలజీ , ప్రసూతి విభాగంలో నైపుణ్యం కలవారు లేరు.
దీంతో విదేశాల నుంచి నిపుణులను తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.