ఏ వ్యాధికైనా చికిత్స అందించాలంటే ముందుగా దానిని గుర్తించాలి.అప్పుడే దానికి సరైన మందును వేసి నయం చేయగలం.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను వేగంగా గుర్తించేందుకు వివిధ రకాల కిట్లు అందుబాటులో ఉన్నాయి.అయితే వీటి ద్వారా ప్రయోగం చేయాలంటే ముందుగా అనుమానితుడు/ రోగి వద్ద నమూనాలను సేకరించి అనంతరం వాటిని ల్యాబ్కు తరలించాలి.
అక్కడ ఫలితం నిర్థారణ కావాలంటే కనీసం 24 గంటల సమయం పడుతుంది.ఈ సమయంలో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
అనుమానితుడు నలుగురితో కలవడం వల్ల ఆరోగ్య వంతులకు సైతం కోవిడ్ సోకుతోంది. వ్యాధిని ఎదుర్కోవడంలో ప్రభుత్వాలకు పెద్ద సమస్య ఎదురవుతోంది ఇక్కడే.
కొన్ని చోట్ల ఫలితం కోసం బాధితుడు రోజులు తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.దీనికి తోడు ఎన్నో ప్రయోగశాలల్లో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది.ఈ నేపథ్యంలో ఎలాంటి ల్యాబ్తో పనిలేకుండా.ఉన్న చోటే కోవిడ్ 19 పరీక్ష నిర్వహించి, ఫలితాన్ని తెలుసుకునే సరికొత్త పరికరాన్ని అమెరికా పరిశోధకులు రూపొందించారు.
కరోనా పరీక్షల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు తాము సులభంగా వినియోగించుకోదగ్గ పరికరాన్ని రూపొందించినట్లు ఈ ప్రయోగంలో పాల్గొన్న భారత సంతతి శాస్త్రవేత్త రషీబ్ బషీర్ తెలిపారు.
కరోనా పరీక్ష నిమిత్తం అనుమానితుల నుంచి స్వాబ్ సేకరించి.ఆర్టీ-పీసీఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని… ఈ విధానంలో వైరస్ ఆర్ఎన్ఏను రకరకాల ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించాల్సి వుంటుందని రషీద్ చెప్పారు.దీని కోసం ప్రత్యేకమైన పరికరాలు, నిపుణులు అవసరమన్నారు.
ఇదే సమయంలో తమ బృందం అభివృద్ధి చేసిన ‘‘ ల్యాంప్ ’’ ప్రక్రియ ద్వారా ఒకేసారి 65 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వైరస్ను పరీక్షించి, ఫలితం ఏంటన్నది తెలుసుకోవచ్చని బషీర్ స్పష్టం చేశారు.
క్యాటరిడ్జ్లా ఉండే పరికరంలో ఓ వైపు వ్యక్తుల స్వాబ్ను, మరోవైపు ల్యాంప్ కెమికల్ను ఉంచుతామన్నారు.
అనంతరం దానిని చేతితో పట్టుకోదగ్గ హీటింగ్ ఛాంబర్లో వేడి చేస్తామని తెలిపారు.అరగంటలో ‘‘ పాజిటివ్ ’’ ఫలితం ఉంటే ఫ్లోరోసెంట్ లైట్ వెలుగుతుందని, దీనికి అనుసంధానించిన స్మార్ట్ఫోన్ కెమెరా ఈ నిర్థారణా పరీక్షను రికార్డు చేస్తుందని రషీద్ బషీర్ వెల్లడించారు.