ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్తో ‘వాల్మీకి’ అనే చిత్రంను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.డీజే చిత్రం తర్వాత హరీష్ శంకర్ చాలా గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు వాల్మీకి చిత్రాన్ని మొదలు పెట్టాడు.
అయితే ఆ చిత్రం గురించి మరియు ఇంకా కొన్ని విషయాల గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు.మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నేను అధికారికంగా ప్రకటిస్తేనే మీరు నమ్మండి అంటూ ట్వీట్ చేశాడు.
మొదటగా వాల్మీకి చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించబోతుంది.ఈ చిత్రంలో ఆమెతో నటింపజేసేందుకు దర్శకుడు హరీష్ శంకర్ ఏకంగా రెండు కోట్ల పారితోషికం ఇస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.
ఆమెతో డీజే చిత్రంలో ఇప్పటికే పని చేసిన హరీష్ శంకర్ మరోసారి ఆమెతో వర్క్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆమె కేవలం 15 నుండి 20 రోజులు మాత్రమే వాల్మీకి చిత్రం కోసం డేట్లు ఇవ్వనుంది.
ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకున్నా కూడా రెండు కోట్ల డిమాండ్ ఇచ్చేందుకు సిద్దం అవ్వడంపై దర్శకుడిపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.అయితే ఆమె పారితోషికం విషయం నిజం కాదని ఆయన తేల్చి చెప్పాడు.
ఇక వాల్మీకి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా గురించి కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.గత కొన్ని రోజులుగా మీడియాలో హరీష్ శంకర్ తదుపరి చిత్రం పవన్ కళ్యాణ్ తో ఉండబోతుందని అంటున్నారు.పవన్ రాజకీయాల నుండి మళ్లీ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని అందుకే ఆయన సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను చేయాలని పవన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మరి ఆ చిత్రం కూడా పుకార్లే అంటూ దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు.