తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయం ఏమిటో అప్పుడే సీనియర్లకు చూపిస్తున్నారు.తనతో వ్యవహారం ఆషామాషీగా ఉండదని, రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా తన నిర్ణయాలు ఉంటాయి అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు.
త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గం లో జరగబోయే ఉప ఎన్నికలు రేవంత్ సత్తా ఏమిటో తెలియజేయబోతున్న నేపథ్యంలో, ఇప్పటి నుంచే అక్కడ గెలుపు కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ కు పోటీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువైన కౌశిక్ రెడ్డి పోటీలో ఉంటారని అంత అభిప్రాయపడగా, ఇప్పుడు రేవంత్ మాత్రం ఆయన పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ లో కాంగ్రెస్ కు విజయం దక్కాలంటే ఆ ప్రాంతంలో గట్టిపట్టు ఉన్న బలమైన నేతలు రంగంలోకి దించాలని చూస్తున్నారు.దీనిలో భాగంగానే తనకు సన్నిహితులైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరును రేవంత్ తెరపైకి తెచ్చారు.
దేవరాయాంజాల్ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి పనిచేయడంతో పాటు ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో సన్నిహితంగా మెలగడం తో అప్పట్లోనే ఆయన టిఆర్ఎస్ లోకి వెళ్తున్నారు అనే ప్రచారం జరిగింది.
అయితే ఆయన తెర వెనుక టిఆర్ఎస్ పెద్దలతో మంతనాలు చేస్తున్నారని రేవంత్ కు సమాచారం ఉండటంతోనే ఆయన పేరును పక్కనపెట్టి, గతంలో కరీంనగర్ ఎంపీ గా పనిచేసిన సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పేరును ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన రైతు భరోసా యాత్ర ముగింపు ఈ సభకు పార్టీ సీనియర్లు వెళ్లొద్దని సూచించినా, పొన్నం ప్రభాకర్ హాజరై రేవంత్ కు మద్దతు తెలియజేశారు.
ఇక పిసిసి అధ్యక్ష పదవి సాధించే విషయంలో పొన్నం ప్రభాకర్ రేవంత్ కు అండగా ఉండటంతో, ఆయన పేరుని ఇప్పుడు ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం పేరు ను అధికారికంగా ప్రకటిస్తే హుజూరాబాద్ నియోజకవర్గం లో పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది.ఇప్పటికే టిఆర్ఎస్ తరపున కోరం సంజీవరెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
బిజెపి తరఫున ఈటెల రాజేందర్ పోటీ చేయబోతున్నారు.మొన్నటి వరకు కాంగ్రెస్ పేరును పరిగణనలోకి తీసుకోకపోయినా, రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు.
పొన్నం ప్రభాకర్ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉండటంతో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది.