ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Former MP Ponguleti Srinivas Reddy ) రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.బీఆర్ఎస్ పార్టీ ( BRS party )అధిష్టానం పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.
పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి రాజకీయం ఎవరికీ అంతుపట్టడంలేదు.ఆయన బిజెపిలో చేరతారా లేక సొంత పార్టీ పెడతారా అనేది ఉత్కంఠ కలిగిస్తూనే ఉంది.
అసలు ఆయన రాజకీయ రూటు ఎటువైపు అనేది తెలియక అనుచరులు కూడా అయోమయానికి గురవుతున్నారు.ఆయన బిజెపిలో చేరబోతున్నారనే ప్రచారం చాలా కాలం నుంచి ఉంది.
కేంద్ర బిజెపి పెద్దలతోనూ పొంగులేటి రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరిగింది.ఇక ఆ తర్వాత సొంతంగా ఆయనే ఒక పార్టీ పెడుతున్నారని, ఆ పేరు కూడా తెలంగాణ రైతు సమితి (టిఆర్ఎస్ ) అని ప్రచారం జరిగింది.
అయితే వేటిపైన శ్రీనివాస్ రెడ్డి స్పందించలేదు.
కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ పొంగులేటి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు.నియోజకవర్గాల వారీగా తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ, బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నారు.బీఆర్ఎస్ ను నమ్ముకుని ఎనిమిదేళ్లుగా కష్టపడి పనిచేసినా.
తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని అందుకే పార్టీకి దూరమైనట్లుగా పొంగులేటి చెబుతున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేశారు.
పినపాక, ఇల్లందు, అశ్వారావు పేట, వైరా నియోజకవర్గాల్లో తన వర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను సైతం పొంగులేటి ప్రకటించారు.ఇంకా పాలేరు, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను త్వరలోనే ప్రకటించబోతున్నారట.అయితే పొంగులేటి సొంత పార్టీ పెడతారా లేక బిజెపిలో చేరతారా అనేది ఇంకా క్లారిటీ లేకుండానే అభ్యర్థులను ప్రకటిస్తుండడంతో పొంగులేటి రాజకీయం ఎవరికి అర్థం కావడం లేదు.ఇక రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
అయితే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు.కానీ ఆయన ఖమ్మం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.