హుజూరాబాద్ నియోజకవర్గం లో రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి.టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత, ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సానుభూతి జనాల్లో కనిపించింది.
వెంటనే ఎన్నికలు జరిగితే అఖండ మెజారిటీతో రాజేందర్ హుజురాబాద్ లో గెలిచి ఉండేవారు.కానీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్న కొద్దీ రాజేందర్ లో టెన్షన్ పెరిగిపోతుంది.
ఈటెల రాజేందర్ కు ఈ నియోజకవర్గంలో ఉన్న పలుకుబడి, పట్టు అన్నిటి గురించి టిఆర్ఎస్ అగ్రనేతలు అందరికీ బాగా తెలుసు.ఆయనను ఓడించడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయంతోనే పూర్తిగా రంగంలోకి కేసీఆర్ దిగిపోయారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయనే విషయాలను నివేదికల రూపంలో తెప్పించుకున్నారు. ఆ తర్వాత రాజేందర్ కు పోటీగా బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా రంగంలోకి దించారు.
దీంతో బీసీ వర్గాల్లోనూ చీలిక మొదలైంది.ఆ తరువాత రాజేందర్ వెన్నంటే ఉండే ప్రధాన అనుచరులను టీఆర్ఎస్ వైపు తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు.అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న 35 వేల దళిత సామాజిక వర్గం ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టారు.దాదాపు ఈ నియోజకవర్గంలో 17 వేల మందికి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు.
ఒక్కో బ్యాంక్ అకౌంట్ లో పది లక్షలు జమ అవుతూ ఉండడం తో ఆ సామాజిక వర్గం పూర్తిగా తమవైపే ఉంటుందనేది టిఆర్ఎస్ అభిప్రాయం.ఈ వ్యవహారము రాజేందర్ కు ఆందోళన కలిగిస్తోంది.
దళితులకు ఇంత భారీ స్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చడం పై మిగతా సామాజిక వర్గాల్లో ఆగ్రహం పెరిగి, వారంతా తమకు అనుకూలంగా మారుతారని రాజేందర్ అంచనా వేయగా, మిగతా సామాజిక వర్గాలకు భారీగానే లబ్ధి చేకూరే విధంగా కొత్త కొత్త పథకాలను టిఆర్ఎస్ ప్రవేశపెడుతూ రాజేందర్ కు గెలుపు అవకాశాలు లేకుండా చేస్తుండడంతో తన గెలుపుపై రాజేందర్ కు సందేహాలు మొదలయ్యాయట.