పేరుకు పార్టీ ఉన్నా, ప్రజల్లో బలం పెంచుకోలేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీలకు విజయం తీసుకొచ్చేలా చేయడం, వారికి బలం పెరిగేలా చేసే పార్టీగానే జనసేన ముద్ర వేయించుకుంది.మొదటి నుంచి జనసేనలో ఇదే పరిస్థితి ఉంటూ వస్తోంది.2019 ఎన్నికలలోనూ ఏపీలో పెద్దగా బలం లేని వామపక్ష పార్టీలతోనూ, ఉత్తరప్రదేశ్ కు చెందిన బి ఎస్ పి పార్టీతోనూ ఏపీలో పవన్ పొత్తు పెట్టుకున్నారు.కానీ ఆ పొత్తు లు జనాల్లో ఏమాత్రం వర్కౌట్ కాలేదు సరికదా జనసేన రాజకీయం పై అనుమానాలు పెంచాయి.
ఇక పవన్ విషయానికి వస్తే.కొన్నాళ్లు రాజకీయం, మరికొన్నాళ్లు సినిమా, ఇంకొన్నాళ్ళు మౌనం ఇలా జనసేన పార్టీ పరిస్థితి, స్థితి గతి రకరకాలుగా ఉండడంతో ప్రజల్లో బలం పెంచుకునే అవకాశం లేకపోవడం వంటి కారణాలతో గతం కంటే గ్రాఫ్ బాగా తగ్గిపోతూ వచ్చింది.
రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకోలేరు అనే అభిప్రాయము దాదాపు అందరిలోనూ వచ్చేసింది.దీనికి తగ్గట్టుగానే పవన్ వైఖరి ఉండడం, బిజెపి వంటి జాతీయ స్థాయి పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఆ పొత్తు ఉందో లేదో అనే అనుమానం సొంత పార్టీ నాయకులకు రావడం, బిజెపి నేతలు పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరిస్తుండడం వంటి కారణాలతో జనసేన పరిస్థితి అయోమయంగా మారింది.
ఇదే రూట్లో వెళితే ఎప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్లడం కష్టమనే అభిప్రాయం పవన్ కు కలిగింది.అంతే కాకుండా, త్వరలోనే తిరుపతి ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో, రాజకీయంగా స్పీడ్ పెంచకపోతే ఎప్పటికీ ఇలాగే అవమానాలు ఎదుర్కోవాలి అనే విషయాన్ని పవన్ గ్రహించారు.
అదీ కాకుండా పొత్తు ఉన్నా తమను పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్న బిజెపి కి గట్టి ఝలక్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు పవన్ వైసిపి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఎవరిని విమర్శిస్తే రాజకీయ కాక మొదలవుతుందో సరిగ్గా వారినే ఎంచుకుని విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.మంత్రి కొడాలి నాని వంటివారిని టార్గెట్ చేసుకుంటే ఆయన ఏ స్థాయిలో ఫైర్ అవుతారో పవన్ కు తెలియంది కాదు.ఇప్పుడు వైసిపి వర్సెస్ జనసేన అన్నట్లుగా రాజకీయ యుద్ధం జరుగుతూ ఉండడంతో, జనసేన గ్రాఫ్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఇదంతా పవన్ వ్యూహాత్మకంగానే ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తుంది.ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తీరుతో జనాల్లో మంచో చెడో ఏదో ఒక చర్చ జరుగుతోంది.
జనసేన కు గతం కంటే మరింత ఆదరణ పెరుగుతోంది అనేది పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.అంతే కాకుండా బిజెపి సైతం తమకు గతం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పవన్ బలంగా నమ్ముతూ ఉండడంతో ఈ విధంగా స్పీడ్ పెంచినట్టు కనిపిస్తున్నారు.ఇక మీడియా సైతం ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్లకు ప్రాధాన్యం ఇస్తోంది.వైసిపి జనసేన మధ్య రాజకీయ యుద్దాన్ని కూడా హైలెట్ చేస్తున్నాయి.ఇప్పుడు జనసేన , వైసీపీ ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి నెలకొంది.ఇదే స్పీడును మరి కొంతకాలం పాటు కొనసాగించి రాజకీయంగా బలం పెంచుకోవాలి అనేది పవన్ ప్లాన్ గా కనిపిస్తోంది.
జనాల్లో జనసేన గ్రాఫ్ పెరిగినా, పెరగకపోయినా బిజెపి దగ్గర గ్రాఫ్ పెరిగితే పవన్ జనసేనకు రాజకీయంగా ఎంతో మేలు జరిగే అవకాశం ఉన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.మరి పవన్ ఈ స్పీడ్ కంటిన్యూ గా ఎన్నికల వరకు కొనసాగిస్తే పవన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.అలా కాకుండా రెండు మూడు రోజులు హడావుడి చేసి మళ్ళీ పొలిటికల్ గా సైలెంట్ అయిపోతే మరిన్ని రాజకీయ విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.