రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హడావుడి పెరిగిపోయింది ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతుండగా, వచ్చే ఏడాది లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల నాయకులు జనాల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు .
ఇప్పటి నుంచి తమ పరపతి పెంచుకుంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తే… రాబోయే ఎన్నికల్లో గట్టెక్కవచ్చు అనే లెక్కల్లో అన్ని పార్టీల నేతలు ఉన్నారు.ముఖ్యంగా పాదయాత్ర ద్వారా సునాయసంగా జనాలకు దగ్గరయ్యి గెలుపుకు బాటలు వేసుకోవచ్చు అనీ లెక్కలు వేసుకుంటున్నారు.
ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను నిర్వహించారు.
ప్రస్తుతం తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్రను నిర్వహిస్తుండగా , వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా ప్రజాసంఘాతం యాత్రను ఇప్పటికే మొదలుపెట్టి కొనసాగిస్తున్నారు.
ఇక ఏపీ విషయానికి వస్తే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ఆయన పాదయాత్రను కొనసాగించనున్నారు.ఈ యాత్రలో ప్రజలకు దగ్గర అయ్యేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు .ఇప్పటికే ఆయన పాదయాత్ర చేపట్టి నేటికీ 12 రోజులు అవుతుంది.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా బస్సు యాత్రను చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ బస్సు యాత్ర ద్వారా ఏపీలోని 175 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా , ఎన్నికల వరకు జనాల్లో ఉండేలా పవన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇక ఏపీ అధికార పార్టీ వైసిపి గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో పార్టీ నాయకులు , అధికారులను జనాల ఇళ్ల వద్దకు పంపించి , ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేస్తోంది.ఈ విధంగా ఏపీ తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు జనాల్లోకి వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేయడం , పాదయాత్రలు, బస్సు యాత్రల పేరుతో జనాలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ సందడి నెలకొంది.