అన్ని పార్టీలకంటే తెలుగుదేశం పార్టీలో వారసుల హవా మొదటి నుంచి కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంది.ఇక ఎన్నికల్లో టికెట్ల కోసం వారసులు , వారి తండ్రులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
ఏది ఏమైనా తమ వారసులకు టికెట్లు ఇవ్వాల్సిందే, లేకపోతే నా సంగతేంటో చూపిస్తా అంటూ సీనియర్ నాయకులు చంద్రబాబు కి వార్నింగ్ లు కూడా ఇచ్చే రేంజ్ కి వెళ్లిపోయారు.కొంతమంది సీనియర్లు మాత్రం తమ స్థానాన్ని త్యాగం చేసి మరి వారసులకు కట్టబెట్టారు.
అయితే అదే ఇప్పుడు వారిని కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని తెగ బాధపడిపోతున్నారు.చంద్రబాబు నాయుడు కూడా తన రాజకీయ వారసుడు ఐటీ మంత్రి లోకేష్ ను ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించాడు.
మంగళగిరిలో గెలుపు కోసం కాస్త గట్టిగానే లోకేష్ కష్టపడ్డాడు.అయితే గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపికై నేరుగా మంత్రి అయిపోయిన లోకేష్ కు ప్రత్యక్ష ఎన్నికలు చుక్కలు చూపిస్తున్నాయంటున్నారు.
లోకేష్ గెలుపుపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయట.మంగళగిరిలో పద్మశాలీల ఓట్లు మెజార్టీ స్థాయిలో ఉన్నాయి.అలాగే బీసీ కులాలకు చెందిన వారు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు.వారంతా ఒకే మాటగా వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కి వేసినట్టు టీడీపీ అధినేతకు సమాచారం అందింది.
దీంతో బాబు లో ఎక్కడలేని భయం మొదలయినట్టు తెలుస్తోంది.
రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసిన పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ గెలుపు పై కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయట.
ఆయన పోటీ చేయడం పార్టీలో చాలా మందికి ఇష్టం లేదని, వారంతా పైకి తెలుగుదేశం పార్టీకి పని చేసినా అంతర్గతంగా వైసీపీ గెలుపు కోసం పనిచేసినట్టు సమాచారం.ఇక అనంతపురం ఎంపీగా పోటీ చేసిన జే.సీ.దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి గెలుపు కూడా అనుమానంగానే ఉండదట.కర్నూలు నుంచి పోటీ చేసిన టీ.జి.వెంకటేష్ తనయుడు భరత్ విజయం కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్టు టీడీపీకి రిపోర్ట్స్ అందుతున్నాయి.ఈ విధంగానే ప్రతి జిల్లాలోనూ వారసుల గెలుపుపై నీలి నీడలు కమ్ముకోవడం టీడీపీలో ఆందోళన పెంచుతోంది.