బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తుపై గత కొంత వార్తలు వస్తునే ఉన్నాయి.కొద్ది నెలల క్రితం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కన్నా లక్ష్మీనారాయణ బేటీ కావడంతో ఇక అప్పటి నుంచి ఆయన జనసేన లో చేరిపోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
అయితే కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్ నేత తమ పార్టీలోకి వస్తే ఆయనకు సముచిత స్థానం ఇవ్వడంతో పాటు , సత్తెనపల్లి నియోజకవర్గంలో నుంచి ఆయనను పోటీకి దింపేందుకు జనసేన వ్యూహం రచిస్తోంది.గత కొంతకాలంగా తమను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, విమర్శలతో విరుచుకుపడుతున్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో కన్నా ను పోటీకి దింపడం వల్ల ఆయనను ఈజీగా ఓడించవచ్చనే వ్యూహానికి జనసేన వచ్చింది.
ఈ మేరకు కన్నా తో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరిగింది.ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కన్నా లక్ష్మీనారాయణ కు ఉండడంతో, ఆయనపై జనసేన ఆశలు పెట్టుకుంది .దీంతో పాటు చాలాకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో కన్నా లక్ష్మీనారాయణకు వైరం ఉండడంతో, ఆయన జనసేన వైపు చూస్తున్నారనే వాదనకు బలం చేకూరింది.ఇది ఇలా ఉంటే కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్ నేత పార్టీని వీడితే బిజెపికి జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని భావించిన ఆ పార్టీ హై కమాండ్ ఆర్ఎస్ఎస్ తరఫున పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే శివప్రసాద్ జి ని రంగంలోకి దింపింది.
లక్ష్మీనారాయణతో చర్చలు జరిపి రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం.ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పైన కన్నా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అలాగే జనసేనలోకి వెళ్లే విషయంపైనా కన్నా క్లారిటీ ఇచ్చారు.తనకి ఉన్న స్నేహం కారణంగానే కొంతమంది నేతలను తాను కలిశానని, నాదెండ్ల మనోహర్ తో సమావేశం కేవలం స్నేహపూర్వక భేటీగా కన్నా చెప్పుకొచ్చారు.అయితే తాను పార్టీ మారుతున్నానన్న విషయంలో నిజం లేదంటూ కన్నా ఆ ప్రచారాన్ని ఖండించారు.ఇక శివ ప్రకాష్ జి తో సమావేశం పైన కన్నా క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో బిజెపి బలోపేతానికి సూచనలు అడిగేందుకే తనను శివ ప్రకాష్ జి కలిశారని, బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఎటువంటి బుజ్జగింపులు జరగలేదని కన్న క్లారిటీ ఇచ్చారు.