రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో అందెవేసిన చేయిగా ప్రశాంత్ కిషోర్ ప్రభావం దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది.ఆయన వ్యూహకర్త గా పని చేసిన అన్ని పార్టీలు అధికారంలోకి రావడంతో ఆయన గ్రాఫ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది.
ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న వ్యూహకర్తగా ఆయనకు గుర్తింపు ఉంది.రాజకీయ వ్యూహకతగా తప్పుకుంటున్నాను అంటూ ఈ మధ్యనే ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆయన క్రియాశీలక రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందరికీ అర్థమైంది.కాకపోతే ఆయనకు చెందిన ఐ ప్యాక్ సంస్థ మాత్రం యధావిధిగా రాజకీయ వ్యూహాలు రూపొందిస్తుంది.
అలాగే దానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, పార్టీలతో సంప్రదింపులు వంటివి ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోనే జరుగుతాయి.
ఇటీవల పశ్చిమ బెంగాల్ , తమిళనాడు ఎన్నికల్లోనూ పీకే వ్యూహాలు బాగా పని చేసి, అక్కడ డిఎంకె, తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు అధికారంలోకి వచ్చాయి.
ఇక ఏపీలోనూ జగన్ కు ఘన విజయాన్ని ఏ స్థాయిలో అందించి పెట్టారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అసలు గుజరాత్ లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేందుకు అప్పట్లో పీకే వ్యూహాలు బాగా పనిచేశాయి.
అలాగే కేంద్రంలో 2014 ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి పీకే చేసిన కృషి తక్కువేమీ కాదు.సోషల్ మీడియాలోని సమకాలిన, ప్రాంతీయ అంశాలను పరిగణలోకి తీసుకుని పీకే వ్యూహాలు రచిస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నారు.
ప్రస్తుతం బిజెపి వ్యతిరేక పార్టీలకు ఆయన వ్యూహరచనలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ను ఆయన గుర్తించారు.
దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో , ఆ ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి బిజెపికి వ్యతిరేకంగా ఆ ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను పోషిస్తున్నారు.అయితే ఇవన్నీ వ్యూహకర్త గా కాకుండా అనుసంధాన కర్తగా ప్రశాంత్ కిషోర్ చేయబోతున్నారు.దీనికోసం బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, ప్రత్యామ్నాయ కూటమి బలపరిచే పనిలో ఆయన ఉన్నాడు.ఒకపక్క అనుసంధాన కర్తగా పని చేస్తూనే మరోపక్క తనకు చెందిన ఐ ప్యాక్ సంస్థ ద్వారా వ్యూహాలు రూపొందిస్తూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు.
దీంతో ఆయన కదలికలపై అందరికీ ఆసక్తి రేకెత్తిస్తోంది.