ఇప్పుడు అంతా సోషల్ మీడియా హవా బాగా నడుస్తోంది.ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్ ఫోన్ ఉండడంతో పాటు చౌకగా ఇంటర్నెట్ సేవలు లభిస్తుండడంతో జనాలు ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు.
సోషల్ మీడియా వచ్చాక టీవీల్లో వార్తలు చూసేవారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది.ఎక్కడైనా ఏడైనా జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిపోతున్నాయి.
టీవీల్లో ఒక్కొక్కసారి వాస్తవాలను కప్పిపుచ్చుతూ ప్రచారం అయ్యే కథనాలకు చెక్ పెడుతూ సోషల్ మీడియా లో అసలు నిజాలేంటి అనేది కూడా తెలిసిపోతోంది.అందుకే సోషల్ మీడియా కు కూడా ఆదరణ పెరిగింది.
ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియా ప్రాధాన్యతను బాగా గుర్తించాయి.అందుకే వాటికి బాగా ప్రాధాన్యత ఇస్తూ పట్టు పెంచుకునే పనిలో పడ్డాయి.సోషల్ మీడియా పుణ్యమాని పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది.ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రజల్లోకెళ్లి పలకరింపులు, యాత్రలు, దీక్షల పేరుతో అన్ని పార్టీల నాయకులు నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొందరు కావాలనే వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.మరికొందరు ఎదుటివారి తప్పులను ఎత్తి చూపుతూ తాము మంచివాళ్లం అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.
ఒకప్పుడు స్టూడెంట్స్ లేదా యూత్ దగ్గర మాత్రమే ఉండే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ కనిపిస్తోంది.దీంతో వారంతా నిత్యం సోషల్ మీడియాలో ఆన్లైన్లో ఉంటున్నారు.
ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.వీటికి తామెలా స్పందించాలో వెంటనే డిసైడ్ అవుతున్నారు.
ఈ నేపద్యంలోనే జనసేన యాత్రను పవన్ అభిమానులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు.పవన్ ప్రసంగంలోని ముఖ్యమైన పాయింట్లను మెసేజ్ చేస్తున్నారు.
ముఖ్యంగా పవన్ చేయబోయే, చేసే కార్యక్రమాలను ముందుగానే సోషల్ మీడియాలో పెడుతూ, అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే వైసీపీ బాగా పట్టు పెంచుకుని ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తోంది.అధికార పక్షం ఏ చిన్న తప్పు చేసినా అది సోషల్ మీడియా లో కౌంటర్ రూపంలో ఎటాక్ చేస్తోంది.ముఖ్యంగా వీరు లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని సెటైర్లు వేస్తూ వైసీపీ సోషల్ మీడియా ముందుకు వెళ్తోంది.
ఇక టీడీపీ కూడా సోషల్ మీడియా లో పట్టు పెంచుకునేందుకు భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నా ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితం కనిపించడంలేదు.అందుకే లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి మరీ సోషల్ మీడియా వ్యవహారాలను పర్యవేక్షిస్తూ పట్టు పెంచుకునే పనిలో పడ్డాడు.