ఏపీలో ఎన్నికల హడావుడి మొత్తం మొన్న 11 వ తేదీన ముగిసిపోయింది.ఎన్నికల ఫలితాలకు ఇంకా 40 రోజుల సమయం ఉంది.
ఇప్పటి వరకు ప్రచారంలో మునిగి తేలిన నాయకులంతా రిలాక్స్ అయిపోతారని, ఏపీలో కొంతకాలం ప్రశాంత వాతావరణం ఉంటుందని అంతా భావించారు.కానీ ఎన్నికల సమయంలో నాయకుల మధ్య రాజుకున్న మంటలు ఇంకా చల్లారడంలేదు.
పార్టీల నేతలు, క్యాడర్ అంతా మీడియా, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మరీ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికల సంఘంపై ఏకంగా యుద్ధాన్నే ప్రకటించారు.
అంతే కాదు వివిధ పార్టీల మద్దతు తీసుకుని మరీ ఎన్నికల సంఘం తీరుపై పోరాడుతున్నారు.ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలం అయ్యింది అంటూ ఢిల్లీ లో హడావుడి చేస్తున్నాడు.
రెండు రోజులుగా ఢిల్లీలో ఆయన ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు.వివిధ పార్టీల నేతలతోనూ ఈ విషయం చర్చిస్తూ జాతీయ స్థాయిలో బాబు చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగడుతున్నాడు.
దీంతో చంద్రబాబు నాయుడుకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.చంద్రబాబు ఓటమి భయంతో ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని, బాబు లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక అల్లర్లు, కొట్లాటలు చోటుచేసుకున్నాయి.వైసీపీ, టీడీపీ కి చెందిన వారు ఈ ఘర్షణల్లో గా లయాలపాలయ్యారు.ఇవన్నీ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవ్వడం వైరల్ గా మారింది.సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్పై గ్రామస్థులు దాడి చేసిన ఘటనలో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
ఈ కేసులకు భయపడి గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు.వైసీపీ కూడా తమ అభ్యర్థులపై దాడులు జరిగిన ఘటనలపై పార్టీ తరపున నిజానిజాలను వెలుగులోకి తీసుకురావడానికి పార్టీ నేత మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ వేసింది.
తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపణలకు దిగుతోంది.ఇలా ప్రతి పార్టీ ఏదో ఒక అంశాన్ని తలకెత్తుకుని ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేలా ప్రవర్తిస్తున్నాయి.
.