తెలంగాణ , ఏపీ సీఎంలు ఇద్దరి మధ్య ఎంతటి స్నేహపూరిత వాతావరణం ఉందో అందరికీ తెలుసు.ఒకరికి ఒకరు సహకరించుకుంటూ, ఎన్నో విషయాలలో ఎటువంటి వివాదాలు లేకుండా చేసుకున్నారు.
ఇద్దరూ కలిసికట్టుగా ఉంటూ, ఇద్దరికీ ఉమ్మడి శత్రువులుగా ఉన్న టీడీపీని దెబ్బ తీస్తూ వచ్చేవారు.ఇక విభజన సమస్యల వ్యవహారంలోనూ, ఎటువంటి పేచీలు లేకుండా అన్ని విషయాల్లోనూ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటూ వచ్చే వారు.
మొదట్లో అటు టిఆర్ఎస్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ బీజేపీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చేవి.అయితే ఆ తర్వాత బిజెపి టిఆర్ఎస్ పార్టీ ల మధ్య స్నేహం బెడిసి కొట్టింది.
ముఖ్యంగా తెలంగాణలో బిజెపి నాయకులు టిఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న సమయంలో, కేంద్ర బీజేపీ పై కేసీఆర్ తో సన్నిహితంగా మెలగడం , ఆయన తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కేంద్రం సానుకూలంగా స్పందించడం వంటివి నడిచేవి.అయితే తరువాత తరువాత రెండు పార్టీలకు మధ్య సానుకూల వాతావరణం పూర్తిగా చెడిపోయింది.
ఇక ఏపీ విషయానికొస్తే జగన్ ఇప్పటికీ బీజేపీ కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.జగన్ తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర స్థాయిలో బీజేపీ పెద్దలు మద్దతు పలుకుతూ అనేక రకాలుగా సహకరిస్తూ వస్తున్నారు.
మొదట్లో బీజేపీ నేతలు వైసీపీపై విమర్శలు చేసినా, ఆ తరువాత వారు టిడిపిని టార్గెట్ చేసుకుంటూ వైసిపి పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.ఇది ఈ విధంగా ఉంటే , బీజేపీతో స్నేహం వ్యవహారం అటు కేసీఆర్ , జగన్ ను దెబ్బ తీసినట్టుగా కనిపిస్తోంది.
దీనికి నిదర్శనంగా తాజాగా ఈ ఘటన రుజువు చేస్తోంది.బిజెపి వ్యతిరేక పార్టీలతో డిసెంబర్ లో కెసిఆర్ నేతృత్వంలో హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.ఇదే విషయాన్ని టిఆర్ఎస్ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ వెల్లడించారు.
ఈ సమావేశానికి బీజేపీ వ్యతిరేక పార్టీ లైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ , మాయావతి , డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు హాజరు కాబోతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటి తోను నిర్వహించబోతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.అత్యంత కీలక సమావేశానికి ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు ఈ సమావేశానికి వస్తున్నా, కేసీఆర్ జగన్ ను ఎందుకు పిలవడం లేదు అనే చర్చ జరుగుతోంది.జగన్ కెసిఆర్ మధ్య స్నేహం చెడింది అనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో కేసీఆర్ జగన్ మధ్య వివాదం నడిచింది.ఇప్పుడు ఈ సమావేశం ద్వారా వారి మధ్య స్నేహం బెడిసికొట్టింది అనే విషయం క్లారిటీ వచ్చేసింది.