ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా వాషవుట్ అయిపోయిందనే భావించాలి.2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీలోని కీలక నేతలందరూ తలో దిక్కు అన్నట్లు ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు.అయినా ఆ పార్టీలో ఇప్పటికీ కీలక నేతలు ఉన్నారు.కిరణ్కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, తులసిరెడ్డి, హర్షకుమార్ వంటి నేతలు ఉన్నారు.ముఖ్యంగా హర్షకుమార్ దళిత నేత కాబట్టి ఆయనకు పొలిటికల్ ఫైటర్ అనే పేరు కూడా ఉంది.
హర్షకుమార్ విజయం సాధించి దాదాపు పదేళ్లు దాటిపోయింది.గత రెండు మార్లు ఆయనకు ఎన్నికలు కలిసి రాలేదు.2019 ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతు ప్రకటించినా చంద్రబాబు హర్షకుమార్ను లెక్కలోకి తీసుకోలేదు.దీంతో కాంగ్రెస్ పార్టీలోనే హర్షకుమార్ కొనసాగుతూ వస్తున్నారు.కాంగ్రెస్ పార్టీకి గత వైభవం రాకపోదా అని ఆయన ఎదురుచూస్తున్నారు.కానీ అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతో ఇప్పుడు ఆయన వ్యూహం మార్చుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే హర్షకుమార్ రాజకీయ జీవితాన్ని అంత సులువుగా వదులుకునే నేత కాదు.
తాను అనుకున్నది అనుకున్నట్లు చెప్పేయగల మనస్తత్వం ఆయనది.ఆయన వైఖరి జాతీయ పార్టీలలో నప్పుతుంది కానీ ప్రాంతీయ పార్టీకి కుదరదు.
ఆయనకు సీటు ఇచ్చి గెలిపించుకోవడం అనేది నెత్తిన కుంపటి పెట్టుకోవడమే అవుతుంది.
ఈ నేపథ్యంలో తన సత్తా ఏంటో ప్రాంతీయ పార్టీలకు రుచి చూపించాలని హర్షకుమార్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ ఏడాది సెప్టెంబర్ 26న రాజమండ్రిలో దళిత సింహగర్జన సభ నిర్వహించాలని హర్షకుమార్ భావిస్తున్నారు.ఈ సభకు ఏపీలోని 26 జిల్లాల నుంచి 10 లక్షల మంది దళితులను సమీకరించేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఈ సభను సక్సెస్ చేస్తే తనకు ప్రాంతీయ పార్టీల నుంచి పిలుపు వస్తుందని హర్షకుమార్ ఆకాంక్షిస్తున్నారు.వైసీపీపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు వైసీపీలో చేరాలనే ఆశ లేదని స్పష్టమవుతోంది.
కుదిరితే టీడీపీలో లేదా జనసేన పార్టీలో చేరాలని హర్షకుమార్ ప్రయత్నిస్తున్నారు.మరి 2024 ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున హర్షకుమార్ పోటీ చేస్తారో కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.