ఎన్నికల్లో రాజకీయ నాయకుల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో అదే రేంజ్ లో పందెం రాయుళ్ల హడావుడి కూడా ఉంటుంది.ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు అధికారంలోకి రాబోతున్నాడు ? ఏ నాయకుడి మెజార్టీ ఎంత ? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ? అనే వాటిపై పందేలు జోరుగా సాగుతున్నాయి.ఈ బెట్టింగ్ రాయుళ్లు ఏ రేంజ్ లో ఉన్నారంటే ముందుగానే పందెం కాసే నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది ? ఏ నాయకుడు గెలుపు గుర్రం అనే విషయాలను ముందుగానే సొంతంగా సర్వేలు చేయించుకుని మరీ రంగంలోకి దిగుతున్నారు.మామూలుగానే పందేలకు నిలయంగా మారిన గోదావరి జిల్లాల్లో ఈ బెట్టింగ్స్ ఊపందుకున్నట్టు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలపై పందెం రాయుళ్లు ఆసక్తిగా ఉన్నారు.ఆచంట నియోజకవర్గంలో టీడీపీ తరపున పితాని సత్యనారాయణ, వైసీపీ తరపున చెరుకువాడ రంగనాథరాజు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.భీమవరంలో జనసేన అధినేత పవన్కల్యాణ్, టీడీపీ తరపున పులపర్తి రామాంజనేయులు, వైసీపీ తరపున గ్రంధి శ్రీనివాస్ ఉన్నారు.తాడేపల్లిగూడెంలో తెలుగు దేశం తరపున ఈలినాని, వైసీపీ తరపున కొట్టు సత్యనారాయణ, జనసేనలో బొలిశెట్టి శ్రీని వాస్లు తలపడుతున్నారు.
ఈ మూడు నియోజకవర్గాల్లో తలపడుతున్న వారంతా బలమైన అభ్యర్థులు కావడంతో పోటీ రసవత్తరంగా ఉంది.
ఈ మూడు నియోజకవర్గాల్లో పందేలు కోట్లలో జరుగుతున్నాయి.ఎక్కడా ఏ హడావుడి లేకుండా రెండువైపులా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని వారికి ఐదు శాతం కమీషన్ ఇచ్చి మరీ పందేలు కాస్తున్నారు.కమీషన్దారులు కూడా ఇప్పుడు ప్రజలనాడిని తెలుసుకునేందుకు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.
గెలుపు ఎవరి పక్షాన ఉందో ముందుగానే అంచనా వేసే పనిలోపడ్డారు.బెట్టింగ్స్ కాయడంలో పశ్చిమ గోదావరి జిల్లా పెట్టింది పేరు.
క్రికెట్, కోడిపందాలు గురించి చెప్పనక్కరలేదు.అంతకు మించి ఎన్నికల పందాలు కాస్తుంటారు.
పందేల సంస్కృతి ఇప్పుడు పల్లె పల్లెలకు కూడా విస్తరించింది.