ఏపీలో ఎన్నికల తంతు కాస్త విజయవంతంగా ముగిసింది.అక్కడక్కడా చెదురుమదురు సంఘటనల మినహా అంతా ప్రశాంతంగానే జరిగిందనే చెప్పుకోవాలి.
ఎన్నికల తంతు ముగిసినా ఫలితాల కోసం వచ్చే నెల 23 వ తేదీ వరకు నిరీక్షించడం మాత్రం అటు అభ్యర్థులకు, ఇటు సాధారణ జనాలకు కూడా ఉత్కంఠ రేపే అంశమే.ఆ సంగతి అలా ఉంటే బెట్టింగ్ రాయుళ్ల సందడి కూడా మాములుగా లేదు.
ఇప్పుడు అందరి దృష్టి గెలిచే వారు ఎవరు ? ఓడే వారు ఎవరు అనే అంశంపైనే ఉంది.ఎవరి అంచనాలు వారివి.
దీంతో తమ లెక్కలు తప్పవు అనే నమ్మకంతో పందాలకు దిగుతున్నారు.మొన్నటి వరకు క్రికెట్ బెట్టింగ్స్ తో బిజీ బిజీ గా ఉన్న వీరంతా ఎన్నికల పందేల్లో కోట్లు వెనకేసుకునేందుకు సిద్ధం అయిపోయారు.
బెట్టింగులకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాల్లో కోడిపందేలు ఎంత సాధారణమే ఆ తరువాత క్రికెట్ బెట్టింగ్స్, ఇప్పుడు పొలిటికల్ బెట్టింగ్స్ అదే స్థాయిలో మొదలయ్యాయి.ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థి గెలుస్తాడు ? ఏ పార్టీకి అధికారం చేపట్టే అవకాశం ఉంది అనే అనేక అంశాల ఆధారంగా ఈ బెట్టింగ్స్ జరుగుతున్నాయి.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, విశాఖ జిల్లాలోని గాజువాక స్థానాలపై జోరుగా బెట్టింగ్స్ మొదలయ్యాయి.ఎక్కువ పందెలన్నీ ఇవే స్థానాలపై జరుగుతున్నాయి.
ఆ తరువాత స్థానంలో గుంటూరు జిల్లా మంగళగిరి స్థానం దక్కించుకుంది.ఇక్కడి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ బరిలోకి దిగడంతో భారీ ఎత్తున పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
టిడిపి గెలిచే స్థానాలు ఎన్ని, వైసిపి గెల్చేవి, జనసేన గెలిచే స్థానాలపై ఎవరి అంచనాలతో వారు పందేలకు సిద్ధం అయిపోయారు.
ఎప్పుడూ లేని విధంగా ఈసారి కోట్ల రూపాయల బెట్టింగ్ లు గోదావరి జిల్లాల్లో జరుగుతున్నాయి.ఇల్లు, పొలాలు, నగదు, బంగారం ఇలా ఒకటేమిటి అన్ని తాకట్టు పెట్టి మరీ జూదం మొదలు పెట్టేశారు.కోట్లాది రూపాయల బెట్టింగ్ లతో ఇప్పుడు 42 రోజుల పాటు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కి మించి ఎపి ఎన్నికల ఫలితాలపై జూదం కొనసాగుతోంది.
ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఈ రెండు జిల్లాలకు చెందిన వారు కూడా ఫోన్ ల ద్వారా భారీ బెట్టింగ్స్ కాసేందుకు సిద్ధం అయిపోయారు.వీటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా బెట్టింగ్స్ జోరు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు.