భద్రాచలంలో రోడ్డుపై సీఎల్పీ నేతలు నిరసనకు దిగారు.దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులు భద్రాచలం వద్ద అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది.ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ప్రాజెక్టు పరిశీలనకు అనుమతివ్వాలని సీఎల్పీ బృందం పోలీసు ఉన్నతాధికారులను కోరారు.
మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతమైనందున దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లొద్దని సీఎల్పీ బృందానికి పోలీసులు అడ్డు చెప్పారు.
భద్రతా కారణాల రీత్యా ప్రాజెక్టు సందర్శనను అనుమతి నిరాకరించారు.అయితే, దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శించడం వల్ల అక్కడ లోపాలు బయటపడతాయనే భయం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొందని, అందుకే అనుతించడం లేదంటూ సీఎల్పీ బృందం ఆరోపించింది.
రాష్ట్రంలో ప్రాజెక్టులను పరిశీలనకు వెళ్లాలని సీఎల్పీ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో పరిశీలించాలని సీఎల్పీ నిర్ణయించింది.
దానిలో భాగంగానే దుమ్ముగూడెం ప్రాజెక్టు నుంచి సందర్శనను సీఎల్పీ ప్రారంభించింది.