ఏపీలోని గుంటూరు జిల్లాలోని అమరావతిలో రోడ్డుపై దర్శనమిచ్చిన రెండున్నర కోట్ల రూపాయల బ్యాగ్ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.వెంగళాయపురం హైవేపై కనిపించిన ఈ బ్యాగ్ లో ఉన్న రెండున్నర కోట్ల రూపాయలు నకిలీ కరెన్సీ కావడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే కరెన్సీ నోట్లు నకిలీ అయినా క్యాష్ డిపాజిట్ మెషీన్లు సైతం ఆ నోట్లను తీసుకుంటూ ఉండటం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే ఈరోజు ఉదయం కొందరు స్థానికులకు వెంగళాయపురం హైవే దగ్గర ఒక బ్యాగ్ కనిపించింది.
ఆ బ్యాగ్ ను ఓపెన్ చేయగా అందులో రెండు వేలు, ఐదువందల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి.పెద్ద మొత్తంలో డబ్బు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురై సమీపంలోని పోలీసులకు బ్యాగ్ గురించి సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నగదు ఉన్న బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు ఆ బ్యాగ్ ను వదిలివెళ్లిన వారిని గుర్తించడం కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ కరెన్సీపై చిల్ద్రన్ కరెన్సీ అని ముద్ర ఉండటం గమనార్హం.ఈ ఘటనపై కేసు నమోదు చేశామని సౌత్ జోన్ డీఎస్పీ కమలాకర్ వెల్లడించారు.
రోడ్లపై కరెన్సీని వదిలి వెళ్లటానికి అసలు కారణమేంటో తెలియడం లేదు.ఈ కరెన్సీ ఎక్కడ ప్రింట్ అయింది.? ఈ కరెన్సీని చలామణి చేస్తున్నారా.? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
ఫేక్ కరెన్సీ భారీగా పట్టుబడిన నేపథ్యంలో ప్రజలు కరెన్సీ నోట్ల వీషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.జిల్లాలో ఈ స్థాయిలో నకిలీ కరెన్సీ గతంలో ఎప్పుడూ పట్టుబడలేదు.
పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తు తరువాత ఈ కేసులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.పోలీసులు ఇటీవలే జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను పట్టుకున్న సంగతి తెలిసిందే.