ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్, పల్నాడు ప్రాంతంలో రౌడీయిజం, కోస్తాలో కుల హత్యలు ఉండేవి.ఇవన్నీ ఆధిపత్యం కోసం జరిగేవే.
అయితే ఇప్పుడు ఫ్యాక్షన్, రౌడీయిజం, కులం అనేవి కనుమరుగై రాజకీయ హత్యలుగా మారిపోయాయి.ప్రాంతాల మీద రాజకీయ ఆధిపత్యం కోసం వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరినపుడు ప్రత్యర్ధులని మట్టుబెట్టే ప్రయత్నం రాజకీయాలలో తరుచుగా జరుగుతూ ఉంటాయి.
ఇలాంటి ఘోరాలకి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.తాజాగా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కూడా అలాంటి రాజకీయ వైరంతో జరిగిందే అనే మాట గట్టిగా వినిపిస్తుంది.
ఈ హత్య కేసులో మొదటి నుంచి టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు గట్టిగా వినిపిస్తోంది.కొల్లు రవీంద్ర తన అనుచురుడు చింతా చిన్నితో ఈ హత్య చేయించారన్నది మోకా భాస్కరరావు కుటుంబసభ్యుల ఆరోపణ.
ఈ నేపథ్యంలో, పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నిందితుడిగా పరిగణిస్తూ ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును చేర్చారు.ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వ్యక్తుల కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తోంది.
గుమ్మటాల చెరువు విషయంలో మోకా భాస్కరరావుకు, కొల్లు రవీంద్రకు వివాదం ఉందని మోకా భాస్కరరావు అన్న కుమారుడు మోకా రాజేశ్ అంటున్నారు.మోకా భాస్కరరావు గతంలో రెండు పర్యాయాలు బందరు మార్కెట్ యార్డు చైర్మన్ గా వ్యవహరించారు.
ఇక మోకా భాస్కరరావు రాజకీయ ఎదుగుదలని తట్టుకోలేక ఇలా హత్యా చేయించారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.మరి ఈ విషయంపై కొల్లు రవీంద్ర ఏం చెబుతారు అనేది వేచి చూడాలి.