ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక ప్రమాదంలో కారు డ్రైవర్ మరణించిన సంగతి తెలిసిందే.సిసిటివి ఫుటేజ్ ప్రకారం టిప్పర్ వల్లే ప్రమాదం జరిగినట్లు అర్దమవుతుంది.
కానీ ఆ టిప్పర్ వివరాలు కనుక్కోవడం కష్టమయిన పోలీసులకు ఒక చిన్న టైరు ముక్క సాయం చేసింది.ప్రమాదానికి కారణమైన టిప్పర్ ను,యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ను పట్టించింది.
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ఖాజాగూడ వద్ద టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఇరవై ఏడేళ్ల కారు డ్రైవరు ఎ.నాగరాజ్ మృతి చెందాడు.ఘటనా స్థలం సమీపంలోని హోటల్ వద్ద సీసీ ఫుటేజ్ను పరిశీలించి టిప్పర్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలుసుకున్నారు.టిప్పర్ వెనుక ఉండే తలుపు తగిలి కారు టాప్ అమాంతంగా ఊడిపోవడమేకాక డ్రైవరు ప్రాణాలు కోల్పోయాడు.
ఘటనా స్థలం వద్ద శోధించగా పోలీసులకు ఒక చిన్న టైరు ముక్క లభించింది.కారు ఢీకొనడంతో ఆ టైరు నుంచి ఆ ముక్క ఊడిపడిపోయినట్లు గ్రహించారు.అంతే ఆ చిన్న టైర్ ముక్కను పట్టుకుని చుట్టుపక్కన గ్యారేజ్లలో టిప్పర్లను పరిశీలించడం ప్రారంభించారు.
రాయదుర్గం మధురానగర్ కాలనీ పక్కన ఉన్న గ్యారేజ్లోని ఒక టిప్పర్ వెనుక ఎడమవైపు చక్రాన్ని పరిశీలించి సరిపోల్చగా ఆ ముక్క సరిపోయింది.
దాని తలుపూ కాస్త దెబ్బతిన్నట్లు కనిపించింది.దీంతో ఆ టిప్పర్ డ్రైవరును వెదికారు.అసోంకు చెందిన ల్యాబటాన్ సింగ్ గా గుర్తించారు.అతన్ని పట్టుకుని ప్రశ్నించగా.
రాయదుర్గంలో ఉంటూ టిప్పర్ను నడిపిస్తున్నట్టు చెప్పాడు.ప్రమాదం జరగగానే తాను భయంతో వెళ్లి గ్యారేజ్లో వాహనం నిలిపి పడుకుని బయటికి రాలేదని చెప్పాడు.
ఆ రోజు ఉదయం నానక్రాంగూడలో పనిముగించుకుని ఖాజాగూడ వైపు వస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని వివరించాడు.