తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.క్యూ న్యూస్ సీఈవోగా ఉన్న తీన్మార్ మల్లన్న పై అనేక వివాదాలు చుట్టు ముట్టాయి ఇప్పటికే అనేక కేసులు నమోదు కావడంతో ఆయన వ్యవహారం అరెస్ట్ వరకు దారి తీసింది.
ఉప్పల్ లో ఉన్న మల్లన్న నివాసం లో ఆయన ను పోలీసులు అరెస్టు చేశారు.అరెస్టుకు ప్రధాన కారణం తన వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అంటూ మారుతి జ్యోతిష్యాలయ నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీ కాంతశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు.
వాస్తవంగా ఈ నెల 8వ తేదీన ఈ కేసు విచారణకు హాజరు కావలసిందిగా పోలీసులు కోరారు అయితే తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, తాను విచారణకు హాజరు కాలేను అంటూ మల్లన్న లాయర్ ద్వారా సమాచారం పంపి విచారణకు హాజరు కాలేదు.
అయితే నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు నగర కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు.
మల్లన్న తన వద్ద నుంచి 30 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని ఏప్రిల్ 22 వ తేదీన మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు లక్ష్మీకాంత శర్మ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.డబ్బులు ఇవ్వకపోవడంతో తనకు పై క్యూ న్యూస్ ద్వారా తప్పుడు కథనాలను ప్రచారం చేశారని లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఈ పరిణామాలపై మల్లన్న అనుచరులు తీవ్రంగానే స్పందించారు.తెలంగాణ ప్రభుత్వం మల్లన్న ను కావాలనే వేధిస్తోందని , కెసిఆర్ ఆయన కుటుంబం చేస్తున్న అక్రమాలను బయటపెడుతున్న కారణంగానే ప్రభుత్వం ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు దిగుతుందని, దీనిలో భాగంగానే ఇటీవల క్యూ న్యూస్ ఆఫీసులో దాడులు నిర్వహించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు.మల్లన్న పై కేవలం ఆరోపణలు మాత్రమే కాదు ఆయనతో తిరిగి సన్నిహితులు గా ముద్ర పడి బయటకు వచ్చిన కొంతమంది వ్యక్తులు తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు.ఆయన బ్లాక్ మెయిల్ కు అలవాటు పడ్డారని, ఆయన చెప్పే దానికి చేసే దానికి అసలు పొంతనే లేదు అంటూ ఎన్నో విమర్శలు చేశారు.
ఈ వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతుండగా ఇప్పుడు అరెస్టు వ్యవహారం మరింత కాక రేపుతోంది.