తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా ఉంటుందని ముందు నుంచి అందరూ భావిస్తూనే వస్తున్నారు.జనసేన బీజేపీ కూటమి తరపున బిజెపి తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
అలాగే వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తిని వైసీపీ ప్రకటించింది.అందరికంటే ముందుగా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని ప్రకటించింది.
తమ అభ్యర్థి గెలిచే తీరుతాడు అనే నమ్మకం తో టిడిపి ఉంటూ వచ్చింది.అంతేకాదు మూడున్నర లక్షల ఓట్లు సాధించి తీరుతామని టీడీపీ హడావుడి చేస్తూనే వస్తోంది.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం, తిరుపతి కార్పొరేషన్ లోనూ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడంతో, టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి ఇప్పుడు తిరుపతి నుంచి పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారట.అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఆమెను బుజ్జగిస్తూ పోటీలో ఆమెని దింపేందుకు ప్రయత్నిస్తోంది.
కాకపోతే పార్టీ అభ్యర్థి ఎవరైనా , ఇక్కడ ఓటమి తప్పదు అనే పరిస్థితులు కనిపిస్తుండడంతో, ఇక్కడి నుంచి పోటీకి ఎవరు దిగే సాహసం అయితే చేయలేకపోతున్నారు.ఇక టీడీపీ తరపున పోటీలో ఉన్న పనబాక లక్ష్మి ఇప్పటి వరకు తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించుకోలేదు.
అంతేకాదు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ, పెద్దగా ఆమె హడావుడి చేసినట్టు కనిపించలేదు.దీనికి కారణం ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడకపోవడమే కారణమట.
ఇక ఇక్కడ నుంచి బిజెపి అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉన్నా, జనసేన, బీజేపీ మధ్య ఇప్పుడు సఖ్యత లేకపోవడం, పొత్తు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్థితి ఉండడం, ఇలా ఎన్నెన్నో కారణాలు వైసీపీకి బాగా కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి.అందుకే ఇక్కడ వైసీపీ తామే గెలుస్తాం అనే ధీమాలో ఉన్నట్టుగా కనిపిస్తుండగా, మిగతా పార్టీలు పోటీకి వెనకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి.