పుల్వామా ఉగ్రదాడి తర్వాత, ఉగ్ర స్థావరాలని లక్ష్యంగా చేసుకొని పాక్ ఆక్రమిత కాశ్మీర్ బాలంకోట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ దాడిలో వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతం అయ్యారని కూడా సమాచారం వుంది.
అయితే ఈ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసారు అనేదానికి ఆధారాలు చూపించాలని విపక్షాలు, ప్రధాని మోడీని డిమాండ్ చేయడం అలాగే పుల్వామా దాడిని అడ్డుపెట్టుకొని మోడీని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేయడం తాజా రాజకీయాలలో అందరూ చూసారు.వైమానిక దాడి క్రెడిట్ మోడీకి దక్కకుండా వుండాలని విపక్షాలు కావాలనే వాటిని రాజకీయం చేసి మోడీపై విమర్శలు చేసాయి.
అయితే విపక్షాల విమర్శలని ప్రజలు నమ్మేస్థితిలో లేరు.ఇండియా రక్షణ విషయంలో మోడీని అనుమానించే పరిస్థితిలో కూడా భారతీయులు లేరని మరోసారి రుజువైంది.ఐదేళ్ళ పరిపాలనలో కొద్ది ఆర్ధిక పరమైన నిర్ణయాలతో ప్రజా వ్యతిరేకతని చవిచూసిన మోడీ గ్రాఫ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది క్రమంగా తగ్గుతూ వచ్చింది.అయితే ఉగ్రస్థావరాలపై వైమానిక దాడుల తర్వాత ఊహించని విధంగా మళ్ళీ మోడీ గ్రాఫ్ రెట్టింపు అయ్యింది.
ఇలాంటి సమయంలో మళ్ళీ మోడీనే ప్రధానిగా వుంటే దేశం సురక్షితంగా వుంటుంది అనే భావనని ప్రజలు వ్యక్తం చేసారు.తాజాగా సిఓటర్ ఇఎన్ఎస్ సర్వే ఈ విషయాన్ని ద్రువీకరించింది.