భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో అమెరికా కాంగ్రెస్ సభ్యులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ప్రాంతీయ సమస్యలపై ఉభయ దేశాల ప్రయోజనాలపై చర్చలు జరిపారు.
దక్షిణాసియా, ఇండో పసిఫిక్ రీజియన్ అంశాలపైనా చర్చ జరిపారు.కరోనా సమయంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భిన్న ప్రజలు నివసించే పెద్ద దేశమైనప్పటికీ సమర్థవంగా వ్యవహరించారని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు ప్రధానిని మెచ్చుకున్నారు.
ప్రజాస్వామిక విలువల ఆధారంగా ప్రజలూ ఈ మహమ్మారి కట్టడికి నడుం బిగించారని, అందుకే ఈ శతాబ్దంలో తీవ్రమైన కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాధ్యమైందని ప్రధాని వారితో అన్నారు.భారత్ – అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావడానికి అమెరికా మద్దతు ఇస్తోందని ప్రధాని మోడీ తెలిపినట్లుగా పీఎంవో వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
ఉభయ దేశాల వ్యూహాత్మక ప్రయోజనాల్లో చాలా వరకు సారూప్యత కనిపిస్తున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీతోపాటు అమెరికా చట్ట సభల ప్రతినిధులు పేర్కొన్నట్టు పీఎంవో తెలిపింది.అంతర్జాతీయ స్థిరత్వానికి, శాంతికి భారత్- అమెరికాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని చర్చించుకున్నట్టు వివరించింది.
టెర్రరిజం, పర్యావరణ మార్పులు, సాంకేతిక రంగాలలో సహకారం వంటి అంతర్జాతీయ అంశాలపైనా ఇచ్చి పుచ్చుకోవాలని ప్రధాన మంత్రి .అమెరికన్ ప్రతినిధి బృందంతో అన్నట్లు పేర్కొంది.సెనేటర్ జాన్ కొర్నిన్ సారథ్యంలోని సెనేటర్ మైఖేల్ క్రాపో, సెనేటర్ థామస్ టబర్విల్లే, సెనేటర్ మైఖేల్ లీ, కాంగ్రెస్ సభ్యులు టోనీ గొంజేల్స్, జాన్ కెల్వినర్ ఎలీజీలు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన వారిలో వున్నారు.అయితే ఈ చర్చల్లో ప్రధానంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయాలని చర్చించినట్లుగా తెలుస్తోంది.
కాగా.సెప్టెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా మోడీ వివిధ దేశాధినేతలతోనూ యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, వైఎస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్తో సమావేశమయ్యారు.రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్ పరిణామాలపై చర్చించారు.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమయ్యాయని, రాబోయే ఏళ్లలో భారత్-అమెరికా బంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మోడీ ట్వీట్ చేశారు.