అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ను ఇరుకునపెడుతున్నాయి.ఇప్పటికే కరోనా బారినపడి ప్రచారానికి దూరమయ్యారు అధ్యక్షుడు.
సరిగ్గా ఇదే సమయంలో మిచిగాన్ రాష్ట్ర గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ను కిడ్నాప్ చేసేందుకు కొందరు కుట్ర పన్నారు.దీనిని ముందే పసిగట్టిన ఫెడరల్ అధికారులు వీరి ప్రయత్నాన్ని భగ్నం చేశారు.
డెమొక్రాటిక్ పార్టీకి చెందిన గ్రెట్చెన్ వీలు చిక్కినప్పుడల్లా ట్రంప్పై విమర్శలు గుప్పించేవారు.ఎన్నికలకు నెల ముందు, ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న వేళ ఈ కుట్ర వెలుగులోకి రావడం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. కరోనా వైరస్ ఆంక్షల విషయంలో గవర్నర్ విట్మర్కు డొనాల్డ్ ట్రంప్ మధ్య గతకొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ సమయంలో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక శక్తులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు కుట్రపన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
దీనిలో భాగంగానే గవర్నర్ను గెస్ట్ హౌస్లోనే కిడ్నాప్ చేయాలని ప్రణాళికను కూడా సిద్ధం చేశారని తెలిపారు.ఇందుకోసం దాదాపు 200 మందిని నియమించుకునేందుకు సిద్ధమైనట్లు మిచిగాన్ అటార్నీ జనరల్ డానా నాస్సెల్ ప్రకటించారు.
దీనికి సంబంధించి 13 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు డానా వెల్లడించారు.రాష్ట్ర శాసనసభపై దాడిచేసి అధికారులపై బెదిరింపు చర్యలకు పాల్పడడం, ప్రభుత్వ వ్యతిరేక మిలిటెంట్ గ్రూప్తో సంబంధం ఉందనే అభియోగాలను వీరిపై మోపినట్లు నాస్సెల్ పేర్కొన్నారు.
ఇప్పటికే ఉప్పూ నిప్పూగా ఉన్న ట్రంప్- విట్మర్ల మధ్య తాజా ఘటన మరింత అగ్గిని రాజేసింది.అధ్యక్షుడు ట్రంప్ తన ప్రసంగాలతో ద్వేషాన్ని, రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారని గవర్నర్ విట్మర్ ఆరోపించారు.
హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే ఇలాంటి వారిని ఖండించడానికి ట్రంప్ నిరాకరించారని అన్నారు.అత్యున్నత పదవిలో ఉన్న నాయకులు ఇలాంటివి ప్రోత్సహించినప్పుడే కొందరు తీవ్రభావజాలం కలిగిన వాళ్లు ఇటువంటి చర్యలకు పాల్పడుతారని ఆమె చెప్పారు.
అటు మిచిగాన్ గవర్నర్ ఆరోపణల్ని ఖండించారు ట్రంప్.తమ ప్రభుత్వ న్యాయ విభాగంతోపాటు ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కుట్రను భగ్నం చేశారు.
దీనికి తమను అభినందించాల్సింది పోయి నిందిస్తున్నారంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.