దేశంలో కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా వైరస్ సోకుతుందో అర్థం కాక ప్రజలు కాలు బయటకు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఇంటికే పరిమితమైతే మరి కొంతమంది సగం వేతనానికే పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి గురించి, కరోనా చికిత్సా విధానాల గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇప్పటివరకు వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా కట్టడిలో ప్లాస్మా థెరపీ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తోందని తెలిపిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఒక అధ్యయనంలో ప్లాస్మా థెరపీ ఇవ్వడం ద్వారా కరోనా వైరస్ లక్షణాలను కానీ, కరోనా మరణాలను కానీ తగ్గించడం సాధ్యం కాదని తేలింది.
ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఏప్రిల్ 22వ తేదీ నుంచి జులై నెల 14 తేదీల మధ్య ఐసీఎంఆర్ 39 పబ్లిక్ మరియు ప్రైవేట్ ఆస్పత్రులలో ప్లాస్మా థెరపీ తీసుకున్న కరోనా రోగులపై అధ్యయనం చేపట్టింది.కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి నుంచి యాంటీబాడీలను సేకరించి వాటిని కరోనా రోగికి ఎక్కించే చికిత్సా విధానాన్ని ప్లాస్మా థెరపీ అంటారు.464 మంది కరోనా రోగులపై ప్లాస్మా ఏ విధంగా ప్రభావం చూపిందో పరిశీలించారు.
ఈ 464 మంది రోగులలో 235 మంది రోగులకు ఉత్తమ ప్రమాణాల ప్రకారం, 229 మందికి సాధారణ ప్రమాణాల ప్రకారం ఇచ్చారు.అయితే ప్లాస్మా చికిత్స తీసుకున్న వారు, సాధారణ చికిత్స తీసుకున్న వారిని పోల్చి చూస్తే మరణాల రేటులో ఏ మార్పు కనిపించలేదని సెంట్రల్ టీమ్ స్టడీ డిజైన్ వెల్లడించింది.
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం లేదని తేలడంతో వైద్యులు కొత్త చికిత్సలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.