ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంలో ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు ఆపాలనే ఉద్దేశం తో రకరకాల మార్గాలను వైసీపీ ప్రభుత్వం వెతుకుతోంది.అలాగే ఈ ఎన్నికలను తన పదవీకాలం ముగిసే లోపు నిర్వహించి తన పంతం నెగ్గించుకోవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంతే స్థాయిలో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికీ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలి అంటూ సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది.
హైకోర్టులో ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా తీర్పు రావడంతో రేపు దీనిపై సుప్రీం కీలక తీర్పు ఇవ్వబోతోంది.
ఒకవేళ సుప్రీం’లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా, ఉద్యోగులతో మెరుపు సమ్మె చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.దీనిపై ఇంకా ప్రతిష్టను కొనసాగుతుండగానే, ఇప్పుడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
ఎస్ ఈ సి నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది.
గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఈ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటీషన్ లో ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.2019 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలు జరిగితే 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతారు అని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.దీంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికీ రేపు వెలువడబోయే సుప్రీం తీర్పు పై అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.తాజాగా దాఖలైన పిటిషన్ పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది తేలాల్సి ఉంది.