సృష్టిలో వెలకట్టలేనిది ఏదన్నా ఉందా అంటే అమ్మప్రేమ మాత్రమే.అటువంటి అమ్మ రుణం తీర్చుకోవడం చాలా కష్టం.
కాని అమ్మకు నచ్చిన పనులు చేసి సంతోషపెట్టడం ద్వారా ఆ రుణాన్ని కొంతైనా తీర్చుకోవచ్చు.పిల్లలు ఏ పని చేసినా అమ్మకు ఇష్టమే.
కాని అమ్మ కలగనే కోరికను తీరిస్తే ఇక తన ఆనందానికి అవధులుండవు.అలాంటి సంతోషాన్నే తన తల్లికి ఇవ్వాలనుకుంది ఓ కూతురు.తన తల్లి చిరకాల కోరిక తీర్చి,తనను సంతోషంలో ముంచెత్తింది…
పూజా చించంకార్ అనే మహిళ 38 ఏళ్లుగా ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందారు.తల్లి పదవివిరమణ రోజున ఆమె కుమార్తె అష్రితా చించంకార్ ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసింది.తాను నడిపే విమానంలో ఎయిర్ హోస్టెస్గా ప్రయాణించాలనే అమ్మ కోరిక తీర్చాలనుకుంది.రెండేళ్ల కిందటే ఎయిర్ ఇండియాలో పైలట్గా చేరిన అష్రితా, తన తల్లి పదవీ విరమణ సందర్భంగా ఆమె చివరిగా సేవలందించే విమానాన్ని తాను నడుపుతానని సంస్థను కోరింది.
ఇందుకు ఎయిర్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆమె తల్లి పూజా ప్రయాణించే విమానాన్ని కో-పైలట్ స్థానంలో కూర్చొని నడిపింది.దీంతో పూజా ఆనందానికి అవధుల్లేవు.
ఎయిర్ హోస్టెస్ సేవలకు వీడ్కోలు తెలుపుతున్న బాధ, తన కూతురే చివరి విమానం నడుపుతుందనే సంతోషంతో పూజ భావోద్వేగానికి గురయ్యారు.
‘‘నన్ను పైలట్గా చూడాలనేది అమ్మ కోరిక.ఆమె కోసమే పైలట్ అయ్యా.నేను నడిపిన విమానంలో ఆమె ఎయిర్ హోస్టెస్గా సేవలందించే అవకాశం దక్కలేదు.అందుకే, ఆమె విధులు నిర్వహించే చివరి విమానానికైనా పైలట్గా ఉండాలనే ఉద్దేశంతో ఎయిర్ ఇండియాను అభ్యర్థించాను.
ఇందుకు వారు అనుమతించారు’’ అంటూ తన తల్లి కోరిక గురించి చెప్పుకొచ్చింది అష్రితా.