ఏపీ లో చాలా రోజుల నుంచి మంత్రివర్గ ప్రక్షాళన విషయమై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం ఉన్న మంత్రులలో దాదాపు 90 శాతం మందిని మారుస్తారని ప్రచారం ఒకవైపు, పూర్తిగా ప్రస్తుత మంత్రిమండలి ని పక్కన పెట్టి కొత్తవారితో జగన్ క్యాబినెట్ ఏర్పాటు చేస్తారనే ప్రచారం మరోవైపు జరుగుతోంది.
అయితే జగన్ మాత్రం తన మనసులో మాట బయట పెట్టలేదు.సిమ్లా టూర్ లో మంత్రిమండలి విషయమై జగన్ ఒక క్లారిటీ తెచ్చుకున్నారని, దాని ప్రకారం కొత్త మంత్రి మండలిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
జగన్ ఆలోచన ప్రకారం దాదాపు 20 మంది వరకు మంత్రులు తమ పదవులను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.కాకపోతే ఎవరెవరిని తప్పిస్తారు ? ఎవరికి పదవులు కట్టబెడతారు అనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు.
ప్రస్తుతం మంత్రులలో కొంత మంది జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు తో పాటు, కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న వారు, ఆ శాఖలో పూర్తిగా పట్టు సాధించిన వారు ఉన్నారు.అటువంటివారిని ఇప్పుడు తప్పిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం జగన్ గ్రహించారు.
ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వంటి వారి విషయంలో జగన్ సానుకూలంగా ఉన్నారు.వారిని తప్పిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే మిగతా వారి విషయంలో ఏం చేయాలనే విషయంపై జగన్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మంత్రుల పనితీరు ఎలా ఉంది ? ప్రజల్లో వారికి ఉన్న ఆదరణ, వారి వారి శాఖల పై పట్టు సాధించారా లేదా ? అవినీతి వ్యవహారాలు సంగతి ఇలా అన్నింటిపైనా నివేదికలు తెప్పించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, రంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం ఇలా చాలామందినే తప్పించే ఆలోచనలో జగన్ ఉన్నారట. మంత్రులందరికి సంబంధించి పూర్తి నివేదికలు అందిన తర్వాత , కొత్త మంత్రి మండలి ఏర్పాటుపై జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.