ఎప్పుడో రూపుమాసిపోయి అభివృద్దిలో పోటీ పడుతూ మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ముందుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో జాతి, వర్ణ, లింగ వివక్ష పేరుతో జరుగుతున్న దాడులు నిజంగా దిగ్భ్రాంతికరం.ఇతర గ్రహాలపై గృహాలు, చందమామపై నివాస స్థలాల నిర్మాణం వైపు దూసుకెళ్తున్న మనిషి ఇంకా దిక్కుమాలిన పనులు చేస్తూనే వున్నాడు.
సమాజంలో ఉన్నత వర్ణం, అణగారిన వర్ణం అనే బేధ భావం వల్ల ఏం సాధిస్తారో తెలియని అమాయకత్వంలో మానవజాతి కొట్టుమిట్టాడుతుంటే అది ప్రగతి పథంలో పయనించడం కాదు, మూర్ఖత్వంలో మగ్గుతున్నట్టే లెక్క.
విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులపై జాతి విద్వేషం వల్లనో, మన అవకాశాలను కొల్లగొడుతున్నారనే అక్కసుతోనో అక్కడి స్థానికులు భౌతికదాడికి, అవసరమైతే ప్రాణాలను తీసిన సందర్భాలు కోకొల్లలు.
అయినప్పటికీ భారతీయులు తమ మొక్కవోనీ దీక్ష, పట్టుదల, ధైర్యంతో ముందుకు సాగుతూనే వున్నారు.అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే తదితర దేశాల్లో విద్వేషదాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.తాజాగా భారత్తో అత్యంత సన్నిహితంగా మెలిగే ఫిలిప్పీన్స్లో మనదేశ విద్యార్ధులపై అక్కడి స్థానికులు దాడికి పాల్పడి, రక్తం కారేట్లు కొట్టారు.
వివరాల్లోకి వెళితే.
తమిళనాడుకు చెందిన జవహర్ శ్రీనాథ్ అనే విద్యార్ధి గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో స్థానికంగా ఉన్న ఓ షాపుకు వెళ్లాడు.ఆ సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు అగంతకులు నీ పేరేంటి, నీ దేశం ఏది అంటూ తీవ్ర పదజాలంతో శ్రీనాథ్ను దూషించారు.
వర్ణవివక్ష చూపుతూ రాడ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది.ఈ ఘటనలో శ్రీనాథ్ పళ్లు ఊడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు.
ఇది గమనించిన తోటి విద్యార్ధులు అతన్ని ఆసుపత్రికి తరలించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కాగా, ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్దులు శ్రీనాథ్ ఘటనతో ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు స్థానిక పోలీసుల నుంచి తమకు మద్దతు లభించడం లేదని వాపోతున్నారు.