అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.ఫిలడెల్ఫియాలోని ఓ మూడంతస్తుల భవంతిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఏడుగురు పిల్లలతో సహా 13 మంది సజీవ దహనమయ్యారు.
నగరంలోని పబ్లిక్ హౌసింగ్ అథారిటీకి చెందిన ఫెయిర్మౌంట్ పరిసరాల్లో వున్న ఈ భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి.బుధవారం ఉదయం 6.40 గంటలకు (అమెరికా కాలమానం) ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేయడానికి సుమారు 50 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
అయితే భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్లు ఉన్నప్పటికీ అవి ఫెయిల్ అవ్వడంతోనే ఈ దారుణం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంటున్నారు.ఇదే భవనంలో నివసిస్తోన్న ఎనిమిది మంది రెండు ఎగ్జిట్ మార్గాల గుండా ప్రాణాలతో బయటపడగలిగారని ఫిలడెల్ఫియా డిప్యూటీ ఫైర్ కమిషనర్ క్రైగ్ మర్ఫీ మీడియాకు వెల్లడించారు.
ఈ అగ్నిప్రమాదంపై ఫిలడెల్ఫియా మేయర్ జిమ్ కెన్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తన జీవితంలో ఇప్పటికి వరకు చూసిన ప్రమాదాల్లో ఇదే అత్యంత భయంకరమైనదని ఆయన వ్యాఖ్యానించారు.ఈ భవనంలో రెండు కుటుంబాలు నివసించేందుకు అనువుగా మార్చారని.ప్రస్తుతం అక్కడ 26 మంది నివసిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు.అయితే మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఈ ప్రమాదంపై స్థానికులు సైతం కంటతడి పెడుతున్నారు.
ప్రమాదస్థలికి దగ్గరలో నివసించే డానీ మెక్గ్యురే, మార్టిన్ బర్గర్ట్ మీడియాతో మాట్లాడుతూ.చనిపోయిన పిల్లలలో కొంతమంది తమకు తెలుసునని చెప్పారు.
వారిలో కొందరు రోజూ కేరింతలు కొడుతూ ఆడుతూ వుండేవారని కన్నీటి పర్యంతమయ్యారు.వీరంతా దశాబ్ధంగా ఇక్కడ నివసిస్తున్నారని తెలిపారు.