మార్కెట్ లోకి వచ్చే ప్రోడక్ట్ మంచి, చెడు ఏంటి అనే విషయం కూడా తెలుసుకోకుండా సెలబ్రెటీలు వాటికి ప్రచారం చేస్తూ ఉంటారు.కేవలం సెలబ్రెటీ పేస్ చూసి ఆ ప్రోడక్ట్ లని ప్రజలు కొనుగోలు చేస్తూ ఉంటారు.
అయితే అవి ప్రమాదకరమైనవి అయినా వారికి సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు.ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు మరింత శృతి మించి ఆన్ లైన్ గేమ్ లని కూడా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ గేమ్స్ పిల్లలకి వ్యసనంగా మారిపోయి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి.ఈ నేపధ్యంలో ఆన్లైన్ గేమ్లకు ప్రచారం చేస్తూ పలువురి మరణాలకు కారణమవుతున్నారంటూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ప్రముఖ నటి తమన్నాలకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తమిళనాడుకు చెందిన న్యాయవాది సూర్యప్రకాశం ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఆన్లైన్ గేములు ఆడి నష్టపోతున్న వారు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో పెరిగిపోయాయని, కాబట్టి ఈ గేములకు ప్రచారకర్తలుగా ఉన్న కోహ్లీ, తమన్నాలను అరెస్ట్ చేయాలని ఆ పిటిషన్లో డిమాండ్ చేశారు.
ఆన్ లైన్ రమ్మీ, గ్యాంబ్లింగ్ గేమ్స్ సమాజానికి చాలా ప్రమాదకరమని, ఇది జీవించే హక్కును కాలరాస్తోందని, రాజ్యాంగంలోని 21వ అధికరణకు ఇది విరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.ఆన్లైన్ గేముల నిర్వాహకులు భారీగా నగదు, బోనస్లు ప్రకటిస్తుండడంతో యువత ఈ వ్యసనం బారినపడి ప్రాణాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోహ్లీ, తమన్నాతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ గేములను ప్రచారం చేస్తున్నారని వివరించారు.చెన్నైకి చెందిన 19 ఏళ్ల విద్యార్థి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడని, గ్యాంబ్లింగ్కు బానిస కావడం వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్లో రాశాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాబట్టి ఈ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ని ప్రమోట్ చేస్తున్న విరాట్ కోహ్లీ, తమన్నాలని ఉన్నపళంగా అరెస్ట్ చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.