మా నియోజకవర్గంలోనూ ఉపఎన్నికలు వస్తే బాగుండేది.ప్రభుత్వం మా నియోజకవర్గాలకు వరాల జల్లు కురిపించి, మా జేబులు నింపేవారు అనే అభిప్రాయం ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంని దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ ఆ నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులను కేటాయిస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ, అందరూ ఆశ్చర్యపోయేలా ఆ నియోజకవర్గాన్ని, ఆ నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కొత్తగా ప్రవేశ పెడుతున్నారు.కొత్త రేషన్ కార్డుల జారీ తో పాటు, పెండింగ్ లో ఉన్న అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
ఇక కొత్త కొత్త వరాల జల్లులు కురిపిస్తూ, జనాలు అందులో తడిసి ముద్దయ్యేలా చేస్తున్నారు.ఎలా చూసినా, టిఆర్ఎస్ అభ్యర్థి హుజూరాబాద్ నియోజకవర్గం లో గెలవాలనే లక్ష్యంతో కేసీఆర్ పనిచేస్తున్నారు. కెసిఆర్ ప్రకటిస్తున్న కొత్త పథకాలు, నిర్ణయాలు ప్రస్తుతానికి హుజురాబాద్ నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం చేస్తూ ఉండడంతో, తమ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే బాగుండేదని, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మాదిరిగానే భారీగా లబ్ధి పొంది ఉండేవారమనే అభిప్రాయం అన్ని నియోజకవర్గ ప్రజలలోనూ కలుగుతుందట.ఇటీవల కొంతమంది బహిరంగంగానే తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని , ఉప ఎన్నికలు వచ్చేలా చేయాలని అప్పుడే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే.
ఇక సోషల్ మీడియాలో అయితే ఉప ఎన్నికల అంశం ట్రెండింగ్ గా మారింది.తెలంగాణ లోని అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అటూ పోస్టులు పెడుతుండటం వైరల్ గా మారింది.
ఉప ఎన్నికలు వస్తే తప్ప తమ నియోజకవర్గం అభివృద్ధి చెందదని, తమ జీవితాలు బాగుపడవని, ఉప ఎన్నికలు వస్తేనే నాయకులకు మేము గుర్తొస్తామని, ఎలా చూసుకున్నా, తమకు ఈ వ్యవహారం బాగా కలిసి వస్తుంది అనే అలోచనలోనే జనాలు ఉండడం హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల డిమాండ్ వ్యవహారం అధికార పార్టీ టిఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది.హుజరాబాద్ నియోజకవర్గం ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న దళిత బంధు పథకం తమ నియోజకవర్గం లోనూ అమలు చేయాలంటూ రొడ్లెక్కి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి తలెత్తడంతో , ఈ వ్యవహారం తమకు ఎక్కడ తలనొప్పిగా మారుతుందో అన్న ఆందోళన అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఎక్కువగా కనిపిస్తోంది.