2019 ఎన్నికల ముందు చంద్రబాబు మోకాళ్ళ పై తలకాయ పెట్టి రెండు చేతులు జోడించి ప్రజలకు మొక్కి చెప్పిన ప్రతి విషయం నేడు రుజువయింది.రాజధాని ఉండదు మారుస్తారు అని చెప్పారు.
అరాచకం రాజ్యమేలుతుంది అన్నారు.మీ బిడ్డలు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది అన్నారు.
అభివృద్ధి ఆగిపోతుంది అన్నారు.రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అన్నారు.
ఆనాడు ఆయన చెప్పినవి అన్నిమూడున్నరేళ్లలో రుజువయ్యాయి.చంద్రబాబు పై అక్కసు, ద్వేషంతో వ్యక్తిగత వైరంతోనే నేడు ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసిన అమరావతికి మరణ శాసనం రాశారు జగన్ రెడ్డి.
2024 ఎన్నికల వరకు మూడు రాజధానులకు రెఫరెండమ్ అని బాహాటంగానే చెబుతున్నఅధికారపక్షం వ్యూహం ఏమిటో ప్రజలు అర్ధం చేసుకోవాలి .ఇప్పటికే మూడున్నరేళ్లుగా మూడు రాజధానులు అంటూ సాగదీసిన జగన్ మరో ఏడాదిన్నర రాజధాని అగ్గి రగిలిస్తూ ప్రాంతాల వారీగా విషం పోసి, విద్వేషాలు రెచ్చగొట్టి, ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది జగన్ లక్ష్యంగా కనిస్తుంది.ఒక రాజధానిని కట్టలేరు,మూడు రాజధానులను ఏర్పాటు చేయనూ లేరు.
కానీ,మూడు రాజధానుల పేరిట ప్రాంతీయ భావోద్వేగాలు మాత్రం రెచ్చగొడుతూనే ఉంటారు.
అమరావతి పై పోరాటం ఉదృతం అయిన ప్రతిసారీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అదిగో విశాఖకి మారుస్తున్నాం అంటూ ప్రకటన చేయడం అలవాటుగా మారింది.ఇప్పటికే విభజనతో నష్టపోయిన ఏపీ ప్రజానీకం ఈ విషయంలో మరింత ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
మూడు రాజధానుల సమస్య ప్రాంతాల మధ్య విభేదాలుగా తలెత్తక ముందు ప్రజలు పునరాలోచించాలి.విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా మేలుచేస్తుంది? విశాఖను ముంభై లాగా అభివృద్ధి చేస్తామనడం ఆ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప మరొకటి కాదు.మూడున్నరేళ్లుగా విశాఖలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను అమ్మేయడం, మిగిలిన భూములు అధికారపక్ష నాయకులు కబ్జా చేయడం తప్ప ఉత్తరాంధ్రకు చేసిన మేలు ఏమిటోతెలియదు.
మూడు రాజధానుల మాయతో అమరావతికి జగన్ చేస్తున్న ద్రోహాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి.ఉత్తరాంధ్రలో రాజధాని రైతులు పాదయాత్ర చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు మంత్రులు.హైకోర్టు అనుమతితో రైతులు చేస్తున్న పాదయాత్రను అయిదు నిముషాల్లో ఆపేస్తామనడం కోర్టును దిక్కరించడమే అవుతుంది.
రైతులది పాదయాత్ర కాదని ,రియల్ ఎస్టేట్ యాత్ర అని మాట్లాడుతున్నారు.అమరావతి ఉద్యమంపై విషం చిమ్మడం కొత్తకాదు ముఖ్యమంత్రి,మంత్రులకు.గతంలో రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇలాగే రెచ్చగొట్టారు.అయినా అన్ని ప్రాంతాల ప్రజలు రాజధాని రైతులకు బ్రహ్మరథం పట్టారు.
చైతన్యవంతులైన ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా వాస్తవాలు ఏమిటో తెలుసు కాబట్టి వారు గతంకంటే అద్భుతంగా ఆదరిస్తారు.రాజధానిగా అమరావతిని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినప్పుడు ఆ నిర్ణయంలో ప్రతిపక్ష నాయకుడుగా భాగస్వామి అయి దీనిని శిరసావహిస్తున్నానని ప్రకటించిన జగన్, తరువాత శాసనసభ ఎన్నికల ప్రచారంలో కూడా అమరావతికి వ్యతిరేకంగా పల్లెత్తుమాట అనలేదు.
పైగా గత ప్రభుత్వం కంటే అమరావతిని మరింత మెరుగ్గా అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు వైసీపీ హామీ ఇచ్చారు జగన్, నేనిక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాను అంటూ ప్రజలకు రాజధాని విషయంలో భరోసా ఇచ్చారు.కానీ మాట తప్పి మూడు రాజధానుల చట్టం తెచ్చారు.తానూ అధికారంలోకి వస్తే మూడు రాజధానులు తెస్తానని అప్పుడే చెప్పివుంటే, 2019 ఎన్నికలే రెఫరెండమ్ అయివుండేవి.రాజధాని కొత్త రాష్ట్రం మనుగడను, భవితవ్యాన్ని నిర్దేశించే కీలకాంశంగా ఉన్నప్పుడు రాజధాని పై మాట్లాడకుండా ప్రజలను నమ్మించి మోసగించి అధికారంలోకి వచ్చి నయవంచనకు పాల్పడ్డారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాజధాని అంశం తీవ్ర సంక్షోభంలోనూ, రాజకీయ న్యాయపరమైన వివాదాల్లోకి నెట్టబడింది.2014 లో అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షనేతగా అమరావతిని వ్యతిరేకించి ఉంటే రైతులు భూములు రాజధానికి ఇచ్చి రోడ్డున పడే వారు కాదు.
2019 ఎన్నికలముందు రాజధాని ని మారుస్తాను అని చెప్పి ఓట్లు అడిగి వుంటే ప్రజలు మరోవిదంగా తీర్పు ఇచ్చే వారు.మాట తప్పను మడమ తిప్పనని గొప్పలు చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి, నిండు సభలో తాను అమరావతి పక్షాన ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మూడు రాజధానులంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చి జనవంచనకు పాల్పడ్డారు జగన్.న్యాయస్థానం వేలాది ఎకరాలు ధారాదత్తం చేసిన రైతుల పక్షాన నిలిచి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని విస్పష్టంగా తీర్పుచెప్పి ఆరు నెలలు దాటింది.ఒకపక్క ఆ తీర్పును గౌరవిస్తున్నట్లు జగన్నాటకాలు ఆడుతూనే మరో పక్క తమ మూడుముక్కలాటలో మార్పులేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైన అన్యాయం, భావి తరాలకు తీరని ద్రోహం చేస్తున్నది జగన్ ప్రభుత్వం.