కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి వివాదాస్పదంగా మారుతోంది.ప్రపంచంలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది.
రోజు రోజుకు పాజిటివ్ కేసులతో పాటు, మరణాల శాతం విపరీతంగా పెరిగిపోతున్నాయి.దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.
అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.ఇవన్నీ ఇలా ఉండగానే, కరోనా మూడో దశ మొదలు కాబోతోంది అనే టెన్షన్ మరింతగా పెరిగింది.
ఇక బ్లాక్ ఫంగస్ అనే మరో వైరస్ ఇప్పుడు విజృంభిస్తుండడంతో, భారత్ ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది.ఇంతగా జనాలు ఈ వైరస్ ప్రభావంతో అల్లాడుతుంటే, కేంద్రం ఏం చేస్తోంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది.
నిర్ణయాలు ,భారాలు మొత్తం రాష్ట్రాల పై వేసి కేంద్రం ప్రేక్షక పాత్ర వహిస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి.
ఈ కరోనా విషయంలో కేంద్రం సీరియస్ గా దృష్టి పెట్టి, మొత్తం ఈ వ్యవహారాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కంట్రోల్ చేయాల్సి ఉన్నా, కీలక నిర్ణయాలు తీసుకుని కరోనా కట్టడికి ముందుకు వెళ్లాల్సి ఉన్నా, అంత మాత్రంగానే స్పందిస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లా, ప్రతి ఊరిలోనూ ఈ కరోనా కేసులు ఉన్నాయి.ఎంతో మంది జనాలు ఈ ప్రభావంతో అకస్మాత్తుగా మరణించారు మరణిస్తున్నారు.
మరెంతో మంది వైద్య సౌకర్యాలు అందక మరణిస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.స్మశానాలలోనూ అంత్యక్రియలు చేపట్టే విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అయినా కేంద్రం మాత్రం పెద్దగా స్పందించడం లేదు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది.దీనికితోడు కరోనా వాక్సిన్ దిగుమతిపై కేంద్రం జీఎస్టీ విధించడం విమర్శల పాలవుతోంది.దేశం ఇంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రధాని నరేంద్రమోదీ మౌనంగా ఉండడం మొదటి దశ కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొని, రెండోదశలో ఈ విధంగా లైట్ తీసుకున్నట్లుగా వ్యవహరిస్తుండడం దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.అంతర్జాతీయ మీడియా సైతం భారత్ లో ఈ పరిస్థితి ఈ విధంగా అదుపు తప్పడానికి కారణం రాజకీయమే అంటూ కేంద్రంపై విమర్శలు చేస్తోంది.
అయినా రాష్ట్రాలకే అన్ని నిర్ణయాలు వదిలేసి, కేంద్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు గా వ్యవహరిస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది. బీజేపీ కేంద్ర పెద్దలు చాలాకాలంగా సైలెంట్ గా ఉండిపోవడం అనేక అనుమానాలకూ కారణం అవుతోంది.