కేంద్ర అధికార పార్టీ అండదండలు ఉంటే తమకు అన్ని రకాలుగా కలిసి వస్తుందని, రాజకీయంగా బలపడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.మొదట్లో బీజేపీ దగ్గర పవన్ ఎన్నో అవమానాలకు గురయ్యారు.
పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి బీజేపీ జాతీయ పెద్దలు పెద్దగా పవన్ ను పట్టించుకోనట్టు గా వ్యవహరించారు.కనీసం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ సైతం పవన్ కు ఇప్పటికి దక్కలేదు.
అయినా జనసేన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పవన్ ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ వచ్చారు.కేవలం జనసేన కు తాము అవసరం తప్ప , తమకు జనసేన అవసరం లేదు అన్నట్లుగా బీజేపీ వ్యవహరించింది.
అయితే తిరుపతి ఉప ఎన్నికల దృష్ట్యా , అక్కడ గెలవాలంటే కచ్చితంగా జనసేన, పవన్ సామాజిక వర్గం మద్దతు తప్పనిసరిగా కావాలని, అలాగే క్షేత్రస్థాయిలో బీజేపీకి బలం లేకపోవడంతో , జనసైనికుల అండదండల కోసం పవన్ కు ఆకస్మాత్తుగా బిజెపి ప్రాధాన్యతనిచ్చింది.రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.
అయితే అకస్మాత్తుగా బిజెపికి తమపై ప్రేమ పొంగుకు రావడానికి కారణం ఏంటి అనేది పవన్ అర్థం చేసుకోలేని వ్యక్తి కాదు.తమ అవసరం బీజేపీకి ఉంది కాబట్టే , ఇంతగా పొగుడుతూ ప్రాధాన్యం ఇస్తున్నారని, అది లేకపోతే పట్టించుకోరనే విషయం పవన్ బాగా అర్థం చేసుకున్నారు.
ఇక జన సైనికులు సైతం బీజేపీతో పొత్తు విషయంలో ఆగ్రహంగా ఉండడం, తమను పెద్దగా పట్టించుకున్నట్లు వ్యవహరించే బీజేపీతో మనం ఎందుకు పొత్తు కొనసాగించాలి అనే అభిప్రాయం ఉండటం వంటి వ్యవహారాలు పవన్ దృష్టికి వెళ్లాయి.బీజేపీ ని నమ్ముకుని రాబోయే ఎన్నికల వరకు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుని ముందుకి వెళ్తే, ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చిన పవన్, జనసేన ను సొంతంగా బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టారట.
ఇక సినిమాలతో పాటు, జనసేన బలోపేతానికి పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి, నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
ప్రజా సమస్యలపై పోరాటం , జిల్లాల వారీగా పర్యటనలు చేయాలి అని జనసేనాని అభిప్రాయంతో ఉన్నట్లు వార్తలు వస్తుండడంతో, జనశైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.బీజేపీతో పొత్తు విషయంలో పవన్ పునరాలోచనలో పడ్డారనే విషయం మాత్రం ఇప్పుడు జనసేన వర్గాల్లో ఆనందాన్ని కలిగిస్తోందట.పవన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత దీనిపై కసరత్తు మొదలుపెడతారట.