జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఎన్నికల ముందు ఉన్న గెలుపు కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉన్నట్టు కనిపించడంలేదు.అందుకే పార్టీ అభ్యర్థులతో సమావేశం పెట్టి మరీ ఎన్నికల్లో గెలిచే సీట్ల గురించి నేను అస్సలు పట్టించుకోవడంలేదని, జనసేన అసలు ఆశయం సమాజంలో మార్పు రావడమేనని, అదే ఆశయంతో ఎక్కడో ఒక్కచోట మార్పు రావాలన్న ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీని స్థాపించానని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా తన అన్న చిరంజీవి స్థాపించి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ‘ప్రజారాజ్యం’ గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు.ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో చాలా మంది ఆశతో వచ్చివారే తప్ప ఎవరూ ఆశయంతో రాలేదు అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీ స్థాపించిన సమయంలో తాము ఎవరూ కూడా సీట్ల గురించి ఆలోచించలేదని, ఎక్కడో ఒక చోట మార్పు రావాలన్న ఆశయంతోనే పార్టీని ప్రారంభించామని అన్నారు.కానీ ఈ ఎన్నికల్లో చాలా మంది సీట్లు గెలిచి తనకు బహుమతిగా ఇస్తామంటూ చాలా నమ్మకంగా చెబుతున్నారని, కానీ ప్రజాస్వామ్యంలో అటువంటి పదాలకు తావు లేదని స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన పవన్ ఈ విధంగా వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు.
జనసేన పార్టీకి సరైన నిర్మాణమే జరగలేదంటూ అనేక విమర్శలు చేస్తున్నారని, కానీ విమర్శలు చేసినంత సులువుగా నిర్మాణం చేయడం సాధ్యం కాదని, అందుకే నేను అటువంటి విమర్శల గురించి తాను పట్టించుకోకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.సమాజంలో మార్పు జనసేనతో మొదలైందని, అదే తమ అసలైన గెలుపు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.మార్పు ముందు ఎమ్మెల్యే అనే అంశం చిన్న విషయమని , దాన్ని అస్సలు పట్టించుకోవద్దని హితవు పలికారు.
ఈ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై తామేమి ఆలోచించడంలేదని, సమాజంలో మార్పు కోసమే తాము పనిచేశామని చెప్పుకొచ్చారు.డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే ఉద్దేశమే తమ పార్టీకి లేదని పవన్ వ్యాఖ్యానించారు.